“Door-To-Door” Vaccine: ఇంటివద్దకే వ్యాక్సిన్ ఎందుకు సాధ్యం కాదు -హైకోర్టు
ఇంటివద్దకే నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వెయ్యడం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతుండగా.. ఎందుకు సాధ్యం కాదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది ముంబై హైకోర్టు.
High Court: ఇంటివద్దకే నేరుగా వెళ్లి వ్యాక్సిన్ వెయ్యడం సాధ్యం కాదంటూ కేంద్రం చెబుతుండగా.. ఎందుకు సాధ్యం కాదంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది ముంబై హైకోర్టు. కేరళ, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఇంటివద్దకే వ్యాక్సిన్ సాధ్యమైనప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు సాధ్యం కావట్లేదని, వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్రానికి ఉన్న సమస్య ఏంటని చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణితో కూడిన హైకోర్టు ప్రశ్నించింది.
ప్రస్తుత వ్యాక్సినేషన్ విధానంపై దృఢమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించింది. ఇంటింటికి వ్యాక్సినేషన్పై ఇద్దరు అడ్వొకేట్లు దాఖలు చేసిన పిల్పై విచారించిన కోర్టు.. కేంద్ర ప్రభుత్వం డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ చేపట్టవచ్చునని అభిప్రాయపడగా.. వారి వాదనతో కోర్టు ఏకీభవించింది. ఈ విషయంలో కేంద్రానికి వచ్చిన సమస్య ఏమిటో అర్థం కావట్లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఈ విధమైన కార్యక్రమాన్ని తామూ చేపడతామని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కేంద్రానికి లేఖ రాసినట్లు లాయర్లు ప్రస్తావించారు. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదించి తగిన ఆదేశాలు తీసుకోవాలని, ఈ విధమైన కారక్రమం అమలులో సాధ్యాసాధ్యాలను వీలైనంత త్వరగా పరిశీలించాలని సొలిసిటర్ జనరల్కు కోర్టు సూచించింది. ఈ పిల్పై మళ్లీ రేపు(14 జూన్ 2021) విచారణ జరపాలని బెంచ్ నిర్ణయించింది.