ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ఏం సందేశం ఇచ్చారో తెలుసా?
హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు.

Independence Day 2024: ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఎర్రకోట వద్ద ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా సైనికులు పూల వర్షం కురిపించారు. వికసిత భారత్ థీమ్తో స్వాతంత్ర్య వేడుకలను నిర్వహిస్తున్నారు. ఎర్రకోట పరిసరాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎర్రకోటలో వేడుకలకు ఆరు వేల మంది హాజరయ్యారు.
పంద్రాగస్టు సందర్భంగా మోదీ ఎర్రకోట వద్ద ప్రసంగిస్తూ.. హర్ ఘర్ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలని చెప్పారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని తెలిపారు. దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని తెలిపారు. భారత ప్రస్థానం ప్రపంచానికే ఆదర్శనీయమని చెప్పారు.
కొత్తగా 10 కోట్లమంది మహిళలు కొత్తగా స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల్లో పెను మార్పులు తీసుకొచ్చామన్నారు. దేశ హితానికి తమ ప్రాధాన్యం అని చెప్పారు. మన కలలు సాకారమయ్యే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు. 2047 నాటికి వికసిత్ భారత్ మనందరి లక్ష్యమని ప్రధాని మోదీ చెప్పారు. భారత్ ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీరంగంలో గ్లోబల్ హబ్ గా భారత్ ను మార్చాలని తెలిపారు.
ఇంకా ఏమన్నారు?
- మహిళలపై అఘాయిత్యాలు చేస్తే కఠిన చర్యలు
- మహిళలపై అఘాయిత్యాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం
- ఇండియా 5జీతోనే ఆగదు, 6జీ పైనా అధ్యయనం కొనసాగుతోంది
- గ్రీన్ హైడ్రోజన్ హబ్గా భారత్ను తయారుచేస్తాం
- పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్రాలు నూతన విధానాలు రూపొందించాలి
- పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలిగించేలా శాంతిభద్రతలు, సుపరిపాలన ఉండాలి
- 2036లో ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించాలన్న ఆశయం దిశగా అడుగులు వేస్తున్నాం
Also Read: శత్రు దేశాలను వణికించడానికి భారత్ ఎన్ని రూ.లక్షల కోట్లు ఖర్చుచేస్తోంది? టాప్-10 దేశాలు ఏవి?