జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో తదుపరి ఉపరాష్ట్రపతి ఎంపికపై బీజేపీ దృష్టి.. నెక్ట్స్ ఎవరు.. రేసులో ఎవరున్నారంటే..?
2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే..

Jagdeep dhankhar
Jagdeep dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ సోమవారం రాత్రి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు పంపించారు. అనారోగ్య కారణాల వల్లే తాను పదవి నుంచి వైదొలగుతున్నట్లు అందులో పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. ఆయన రాజీనామాతో రాజ్యసభ సమావేశాలను ప్రస్తుతానికి డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ నడిపించనున్నారు.
2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన ధన్ఖడ్కు 2027 ఆగస్టు వరకూ పదవీకాలం ఉంది. అయితే, రెండేళ్ల 344 రోజులకే ఆయన వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు 74ఏళ్లు. ధన్ఖడ్ రాజీనామాతో తరువాత ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై ఆసక్తి నెలకొంది. అయితే, ఇప్పటికే బీజేపీ ఉపరాష్ట్రపతి ఎంపికపై కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులోకి పలువురి పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
లోక్సభ, రాజ్యసభలో ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయే మెజార్టీ సభ్యులను కలిగి ఉంది. దీంతో తదుపరి ఉపరాష్ట్రపతి పదవికి ఎవరిని ఎంపిక చేస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది. అయితే, వివాదాస్పదం కాని వ్యక్తిని బీజేపీ ఎంపికచేస్తుందని, అలాగే పార్టీలో అనుభవజ్ఞుడైన నేతకు ప్రాధాన్యత ఇస్తారని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
ప్రస్తుత గవర్నర్లు, పార్టీలోని సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులుగా ఉన్నవారిలో.. అదికూడా బీజేపీకి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి పదవికి ఎంపికచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే, బీజేపీలోని కొందరు ఎంపీల సమాచారం ప్రకారం.. జనతాదళ్ (యునైటెడ్) ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పేరు చర్చలో ఉన్నట్లు తెలుస్తోంది. 2020 నుంచి ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆయన్ను ప్రభుత్వ విశ్వాసం ఉన్న వ్యక్తిగా చూస్తారు.
నిబంధనల ప్రకారం, ఉపాధ్యక్ష పదవిని భర్తీ చేయడానికి వచ్చే ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలి. కొత్త ఉపాధ్యక్షుడిని ఎన్నుకునే వరకు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభ కార్యకలాపాలను నిర్వహించవచ్చు.