MLA S Keerthana : విజయ్ కేబినెట్లో తెలుగు మహిళ.. అప్పుడు టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలు.. ఇప్పుడు మంత్రిగా.. ఎవరీ కీర్తనా.. ఎక్కడి నుంచి గెలిచింది.. ఫుల్ డీటెయిల్స్
MLA S Keerthana : కీర్తన ఓ సామాన్య యువతి. మధ్య తరగతి కుటుంబం. రాజకీయ మూలాలే లేని కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి పోటీలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు.. విజయ్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Keerthana
- సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే చీఫ్ విజయ్
- విజయ్ కేబినెట్లో తెలుగమ్మాయి కీర్తన
- మంత్రిగా ప్రమాణ స్వీకారం
MLA S Keerthana : తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. టీవీకే అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1967 నుంచి తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల కూటములకు చెందినవారే ముఖ్యమంత్రులుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇన్నేళ్ల తరువాత ఆ రెండు కూటముల నుంచి కాకుండా వేరే పార్టీ (టీవీకే) నుంచి ముఖ్యమంత్రి అయిన తొలి సీఎంగా విజయ్ రికార్డు నెలకొల్పాడు. అయితే, తాజాగా.. విజయ్ కేబినెట్లో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు మహిళ ఎస్. కీర్తనా కూడా ఉన్నారు.
సెల్వి కీర్తన ఓ సామాన్య యువతి. మధ్య తరగతి కుటుంబం. రాజకీయ మూలాలేలేని కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటిసారి పోటీలోనే ఎమ్మెల్యేగా విజయం సాధించడంతోపాటు.. విజయ్ కేబినెట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
కీర్తనది విరుద్నగర్ జిల్లాలోని చత్రరెడ్డియపట్టి. డిగ్రీ వరకు అక్కడే చదువుకున్నారు. తరువాత పాండిచ్చేరి యూనివర్శిటీలో ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిశోర్ బృందంలో పనిచేశారు. గోవా, పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. 2021 ఎన్నికల్లో తమిళనాడులో ఎం.కె. స్టాలిన్ కోసం కూడా కీర్తన పనిచేశారు. హైదరాబాద్లోని టీడీపీ సోషల్ మీడియా లీడ్గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమె తెలుగుపై మంచి పట్టు సాధించారు.
సోషల్ మీడియాలో ఆమెకున్న పట్టును సద్వినియోగం చేసుకుంటూ శివకాశి నియోజకవర్గంలోని సమస్యల గురించి వీడియో పోస్టు చేయడం మొదలుపెట్టిన కీర్తకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. కొద్దికాలంలోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకున్నారు. ఈ ఫాలోయింగ్ను చూసిన విజయ్ టీం.. ఎన్నికలకు సరిగ్గా నెల ముందు శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ టికెట్ను ఆమెకు ఇచ్చింది. కీర్తన తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటూ ప్రజల్లోకి దూసుకెళ్లారు. పలుచోట్ల ప్రచార కార్యక్రమాల్లో తెలుగులో మాట్లాడి ఆయా వర్గాలను ఆకట్టుకున్నారు.
శివకాశి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జి. అశోకన్పై సుమారు 11వేల ఓట్ల మెజార్టీతో కీర్తన విజయం సాధించారు. సోషల్ మీడియాలో యువత నుంచి ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. శివకాశిలో పోటీచేసి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యే కూడా కీర్తన రికార్డు నెలకొల్పాడు. తాజాగా.. ఆమె విజయ్ కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
