యజమాని ఎవరో తేల్చేందుకు “కుక్క”కి DNA టెస్ట్

Labrador To Undergo DNA Test మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని హోషంగాబాద్ లో ఓనర్ షిప్ వివాదాన్ని పరిష్కరించేందుకు 3ఏళ్ల వయస్సున్న ఓ లాబ్రడార్ కుక్కకు DNA టెస్ట్ చేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురైంది. ఆ శునకం తనదంటే తనదంటూ ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా ఫిర్యాదులు చేయడంతో ఆ శునకానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించి దానికి అసలు యజమాని ఎవరో తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హోషంగాబాద్ కు చెందిన జర్నలిస్ట్ షాదాబ్ ఖాన్, ABVP లీడర్ కార్తీక్ శివ్హరే మధ్య ఓ కుక్క విషయమై వివాదం ఏర్పడింది. తన ఇంటి నుంచి తప్పిపోయిన నలుపురంగు కుక్క “కూకూ”ను శివ్హారే బంధించాడని, ప్రస్తుతం దాన్ని మరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని షాదాబ్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కార్తీక్ శివ్హారేను పోలీస్ స్టేషన్కు పిలిపించగా, ఆ శునకం తమదేనని, దాని పేరు కూకూ కాదు టైగర్ అని శివ్హారే చెప్పాడు.
అయితే,ఇరువురి వాదనలు విన్న పోలీసులు ఆ శునకాన్ని ఇద్దరి చేత పిలిపించగా.. కూకూ అని పిలువగానే షాదాబ్ దగ్గరికి, టైగర్ అని పిలువగానే కార్తీక్ దగ్గరికి వెళ్లింది. దీంతో ఆ కుక్క ఎవరిదో తేల్చడం పోలీసులకు క్లిష్టంగా మారింది. వాస్తవానికి షాదాబ్ ఖాన్ గత ఆగస్టులోనే తన కుక్క తప్పిపోయిందని పోలీసులకు మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాడు. ఆ తర్వాత కార్తీక్ శివ్హారే ఇంట్లో దాన్ని గుర్తించి తీసుకునేందుకు వెళ్లగా అతడు గొడవకు దిగాడు. దాంతో షాదాబ్ నవంబర్ 18న మళ్లీ పోలీసులను ఆశ్రయించాడు.
ఆ శునకాన్ని తాను 2017లో పంచమర్హి నుంచి తెచ్చుకున్నానని, కావాలంటే డీఎన్ఏ పరీక్ష నిర్వహించి తన శునకాన్ని తనకు అప్పగించాలని షాదాబ్ పోలీసులను కోరాడు. ఇక శివ్ హారే కూడా తాను ఆ కుక్కను ఇటార్సిలో కొనుగోలు చేశానని అది తనదేనని వాదించాడు. ఈ క్రమంలో పోలీసులు శనివారం (నవంబర్ 21-2020) కుక్క డీఎన్ఏ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. టెస్టు రిపోర్టులు వస్తే అది పంచహర్షి సంతతికి చెందినదా, లేకా ఇటార్సి సంతతికి చెందినదా తేలుతుందని, దాంతో సమస్య పరిష్కారం అవుతుందని పోలీసులు తెలిపారు.