నవంబర్-9న లాలూకి బెయిల్..10న నితీష్ కి ఫేర్వెల్

Lalu Coming Out on Bail on November 9, Nitish’s Farewell Next Day అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బీహార్ లో రాజకీయం రసవత్తరంగా మారింది. నాయకుల మధ్య దూషణల పర్వం కొనసాగుతోంది. అధికార,విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. తాజాగా హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆర్జేడీ నాయకుడు,లాలూ కుమారుడు తేజస్వీయాదవ్…బీహార్ సీఎంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి నితీష్.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని తేజస్వీ ఆరోపించారు
ఎన్నికల్లో విజయం తమదేనని తేజస్వీ ధీమా వ్యక్తం చేశారు. RJD అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నవంబర్- 9న జైలు నుంచి విడుదలవుతున్నారని… ఆ మరుసటి రోజునే సీఎం నితీశ్ కుమార్ వీడ్కోలు అందుకుంటారని మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ తెలిపారు. నవంబర్ 10న బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ అలసిపోయాడని…బీహార్ యోగక్షేమాలు చూసే స్థితిలో ఆయన లేరని తేజస్వీ అన్నారు. 15 ఏళ్లలో ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించలేని వారు వచ్చే ఐదేళ్లలోనూ ఆ పని చేయలేరన్నారు. ప్రధాని బీహార్ కు వచ్చిన క్రమంలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రాకేజీ ఎప్పుడు ఇస్తారో చెబుతారని ఊహించానని. కానీ, అలా జరగలేదని తేజస్వీ తెలిపారు.
మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న జేడీయూ-బీజేపీ కూటమి ప్రశ్నకు తేజస్వీ సమధానమిచ్చారు. .బిహార్ బడ్జెట్ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.