Covid-19 Orphans : తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుపై రూ.5 లక్షల FD
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవమే చేసింది.

Covid 19 Orphans
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవమే చేసింది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు,మరణాలు ఆ రాష్ట్రంలో నమోదయ్యాయి. గతంతో పోల్చితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోవడం కోసం మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నది.
కరోనా మహమ్మారి కారణంగా తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.5 లక్షల చొప్పున ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నట్లు బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ పిల్లలకు 21 ఏళ్లు దాటిన తర్వాత వాళ్లు వడ్డీతో కూడిన ఎఫ్ డీ డబ్బులు తీసుకునేందుకు అర్హులని మహారాష్ట్ర మహిళ మరియు శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్ తెలిపారు.
అదేవిధంగా, ఆ పిల్లలకు నెలకు రూ.1125 ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. కేంద్రం అందించే సాయానికి ఇదంతా అదనం అని తెలిపారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలు 162 మంది ఉన్నారని మహారాష్ట్ర అధికారులు తెలిపారు.