muslims vacate Randhikpur village in protest bilkis bano rape
Bilkis Bano case : 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు మరోసారి దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో 11మంది నిందితులను ఆగస్టు 15 రోజున జరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. కాలం చెల్లిన రెమిషన్ విధానం ప్రకారం వారిని రిలీజ్ చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ క్రమంలో బిల్కిస్ బానో కేసు దోషులు 11 మందిని గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడిచిపెట్టటాన్ని నిరసిస్తూ రంధిక్పూర్ గ్రామంలోని ముస్లింలు తమ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. ఇంకా వెళ్లిపోతునే ఉన్నారు. ఈ కేసులో నిందితులను తిరిగి జైలుకు పంపించాకే తిరిగి తమ గ్రామానికి వస్తామని చెబుతున్నారు. ఈ కేసులో నిందితులను విడిచిపెట్టినప్పటి నుంచి తాము భయం గుప్పిట్లో జీవిస్తున్నామని.. వాపోతున్నారు రంధిక్ పూర్ గ్రామంలోని ముస్లింలు. రంధిక్ పూ్ర గ్రామాన్ని విడిచిపెట్టిన ముస్లింలు దేవగఢ్ బరియాకు వలస వెళ్లారు. దోషులను తిరిగి జైలుకు పంపడంతోపాటు తాము గ్రామంలోకి తిరిగి వచ్చేందుకు పోలీసు రక్షణ కల్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also read : Bilkis Bano case: బిల్కిస్ బానో నిందితుల విడుదల తప్పిదం: సొంత పార్టీపై బీజేపీ సీనియర్ నేత విమర్శలు
అత్యాచారానికి గురైన బిల్కిస్ బానోతో పాటు..ఆమె కుటుంబ సభ్యులు దేవగఢ్ బరియా గ్రామంలోనే నివసిస్తున్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడినవారిని విడుదల చేయటమే కాకుండా వారికి పూలదండలు వేసి సత్కరించటంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా గుజరాత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుకూడా లేదు. పైగా అత్యాచారం నిందులు అంతా బ్రాహ్మణులని..వారు నీతిమంతులు..సంస్కారవంతులు అంటూ బీజేపీ ఎమ్మెల్యే సీకే రౌల్జీ సర్టిఫికెట్ ఇవ్వటం గమనించాల్సిన విషయం.
ఇదిలా ఉంటే రంధిక్పూర్ గ్రామంలోని ముస్లింలకు నిందితులను విడుదల చేసినప్పటినుంచి భయాందోళనలకు గురవుతున్నారు. అందుకే గ్రామం వదిలిపోతున్నారు. అంతేకాదు నిందితులను తిరిగి జైలుకు పంపాకే తిరిగి గ్రామానికి వస్తాం అంటూ ప్రతినపూనారు. ఇటువంటి పరిస్థితి గురించి సమీర్ గచ్చి అనే ఓ వ్యాపారి మాట్లాడుతూ…నా 12 మంది కుటుంబ సభ్యులతో గ్రామాన్ని విడిచిపెట్టి దేవగఢ్ బరియాలోని తన బంధువుల ఇంటికి వచ్చేసానని..తెలిపారు. 11 మంది రేపిస్టులు, హంతకులు జైలు నుంచి విడుదలయ్యాక వారు గ్రామానికి చేరుకున్నాక బాణసంచా కాల్చి, సంగీత్తో సంబరాలు చేసుకున్నారని ఇటువంటి పరిస్థితుల్లో తాము అదే గ్రామంలో ఎలా జీవించగలం? అంటూ ఆవేదనతో ప్రశ్నించారు.
చేసిన నేరానికి కనీసం పశ్చాత్తాపం కూడా వారికి లేదు..పైగా విడుదల అయిన సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు? అంటూవారిలో ఏమాత్రం మార్పురానట్లేగా..వారి జైలునుంచి విడుదల అయినప్పటినుంచి తమకు భయం మొదలైందని.. గ్రామాన్ని వదిలిపెట్టి దేవగఢ్ బరియాకు వలస వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ ఘటన తర్వాత తాము దహోడ్ కలెక్టర్కు లేఖ రాశామని..ఆ 11 మందిని మళ్లీ జైలుకు పంపి బిల్కిస్ బానోకు న్యాయం చేయాల్సిందిగా కోరామని తెలిపారు. అలా జరగకుంటే తాము తిరిగి గ్రామంలో అడుగుపెట్టబోమని తేల్చి చెప్పారు. కలెక్టర్కు పంపిన ఆ లేఖలో 55 మంది సంతకాలు చేశారు.
కాగా..2002లో గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్లో అల్లర్లు జరిగినప్పుడు ఈ అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన 14మందిని దుండగులు హత్య చేశారు. వారిలో ఆమె మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. దీంట్లో భాగంగా నిందుతులు 15ఏళ్లు కారాగారంలో గడిపారు.
అనంతరం తనను విడుదల చేయాలంటూ వారిలో ఓ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు సిఫార్సు చేశారు. ఈ మేరకు వారి విడుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గోద్రా సబ్ జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు.