దిగొచ్చిన పెప్సీ కంపెనీ: రైతులపై కేసులు వెనక్కి.. షరతులతో!
గుజరాత్లో బంగాళదుంపలు పండించిన రైతులకు అన్యాయం జరిగిందంటూ.. దేశ వ్యాప్తంగా రైతు సంఘాలు, రైతు సానుభూతిపరులు ఆందోళనలు చేయడంతో పెప్సీ కో కంపెనీ ఎట్టకేలకు దిగివచ్చింది. గుజరాత్ రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటామని ఆ సంస్థ ప్రతినిధులు గుజరాత్ ప్రభుత్వానికి వెల్లడించారు.
గుజరాత్లోని కొంతమంది రైతులు ఎఫ్సీ5 రకం బంగాళదుంపలను పండించగా, ఆ పంట పండించకూడదంటూ పెప్సీకో 11మంది రైతులపై కేసు వేసింది. ఈ రకం బంగాళదుంపలను తమ లేస్ చిప్స్ తయారీకి వాడుతున్నామంటూ పెప్సీకో కేసు వేసింది.
ఈ క్రమంలో దేశంలో రైతులు ఏం పండించాలో విదేశీ సంస్థ శాసించడం ఏమిటని రైతులు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలోనే గుజరాత్కు చెందిన రైతులపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపారు. అయితే బేషరతుగా కంపెనీ వెనక్కి తగ్గలేదు అని, ఇకపై ఆ రకం దుంపలెవరూ పండించము అనే హామీ ఇస్తేనే కేసులు వెనక్కి తీస్కూంటామని కంపెనీ షరతు విధించినట్లు తెలుస్తుంది.