Punjab Congress : పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, అమృత్సర్ ఎమ్మెల్యే నవజ్యోత్ సిద్ధూల మధ్య వార్ కొనసాగుతోంది. ఇద్దరు నేతల పోస్టర్లు రాజకీయాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి. నవజ్యోత్ సింగ్ కనిపించడంలేదని అమృత్సర్లో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి. సిద్ధూని పట్టిస్తే, 50 వేల రూపాయల రివార్డని ప్రకటించారు. షాహిద్ బాబా దీప్ సింగ్ సేవా సోసైటీ తప్పిపోయిన ఎమ్మెల్యేను వెతకండంటూ పోస్టర్లను జారీచేసింది. మరోవైపు అమరీందర్సింగ్కు వ్యతిరేకంగా పాటియాలలో కూడా కొన్ని పోస్టర్లు వెలిశాయి. గత కొన్ని రోజులుగా సిద్ధూ కెప్టెన్ అమరీందర్సింగ్ను టార్గెట్ చేస్తున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట తారాస్థాయికి చేరింది. ఈ వివాదం కాస్తా ఢిల్లీ హైకమాండ్ వద్దకు చేరింది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పనితీరుపై 20 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని పలు నివేదికలు కాంగ్రెస్కు చేరాయి. దీని వెనుక సిద్ధూ హస్తం ఉందని భావిస్తున్నారు. వీరి మధ్య వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం మల్లికార్జున్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో ఒక ప్యానల్ను నియమించింది. పంజాబ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ హరిష్ రావత్, మాజీ ఎంపీ జేపీ అగర్వాల్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వచ్చే ఏడాది పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో పార్టీలో నెలకొన్న అసంతృప్తిను చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం యత్నిస్తోంది.