Indian Railways : రైల్వేలకు 5 MHz స్పెక్ట్రమ్ కేటాయింపు
రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది.

Indian Railways
Indian Railways రైల్వేశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్, సిగ్నలింగ్ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం రైల్వేలకు 5 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ కేటాయింపునకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 5 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్ ను రైల్వే శాఖకు 700 MHz బ్యాండ్లో కేటాయించనున్నారు.
ఈ స్పెక్ట్రమ్ తో రైల్వేస్ తన రూట్లలో..ఎల్టీఈ ఆధారిత మొబైల్ ట్రైన్ రేడియో కమ్యూనికేషన్ ను ప్రవేశపెట్టనున్నాయి. ట్రైన్ యాక్సిడెంట్ లు జరగకుండా ఇది కాపాడుతుంది. అదేవిధంగా,లోకో పైలట్, స్టేషన్ మాస్టర్ మరియు కంట్రోల్ సెంటర్ మధ్య రియల్ టైమ్ ఇంటరాక్షన్ ను ప్రారంభించడం ద్వారా ఆలస్యాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది.
స్పెక్ట్రమ్తో సమాచార, సిగ్నల్ వ్యవస్థ మరింత మెరుగవుతుందని కేబినెట్ భేటీ అనంతరం మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఇది ప్రయాణికుల భద్రత, రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తుందన్నారు. ప్రస్తుతం రైల్వేశాఖ ఆప్టికల్ ఫైబర్ను మాత్రమే వినియోగిస్తోందన్నారు. స్పెక్ట్రమ్ అందుబాటులోకి రావడం వల్ల రేడియో కమ్యూనికేషన్ కూడా రైల్వేశాఖ వాడే వీలుంటుందన్నారు. సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణ, 5జీ స్పెక్ట్రమ్ అమలు కోసం రానున్న అయిదేళ్లలో 25 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.