రిచ్ దొంగ: బెంజ్ కారులో వస్తాడు.. భారీగా పట్టుకుపోతాడు

విలాసవంతంగా బెంజ్ కారు.. బ్రాసె లెట్, మెడలో గొలుసు.. ఐదు వేళ్లకు ఉంగరాలు ఢిల్లీ మోడల్ తో ప్రేమాయాణం. ఇదెవరో సెలబ్రిటీ లైఫ్ స్టైల్ కాదు. ఓ రిచ్ దొంగ వివరాలు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ సంపన్నుల నివాసాల్లో దొంగతనాలకు పాల్పడి బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగ ఇర్ఫాన్ (30)నేర చరిత్ర ఇది. బెంగళూరు పోలీసులు ఇటీవల ఇర్ఫాన్ ను ముంబైలో అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా సంచలనాలు వెలుగుచూశాయి. దోచుకున్న సొత్తులో కొంత భాగాన్ని బీహార్లోని తన స్వగ్రామంలో వైద్య శిబిరాల కోసం, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఖర్చుపెడుతున్నట్లుగా తేలింది. దొంగతనానికి వచ్చినప్పుడు తన బెంజ్ కారు(హెచ్ఆర్26బీఎం0786)లోనే వస్తున్నట్లు స్పష్టమైంది.
ఢిల్లీలోని సంపన్నుల నివాసుల్లో 12సార్లు దొంగతనాలు చేసి దోచినదాన్ని ప్రేమిస్తున్న మోడల్ కోసం, స్వగ్రామంలో సేవా కార్యక్రమాల కోసం వినియోగించినట్లు తేలింది. స్నేహితురాలితో ఖరీదైన నగరాల్లో బ్యాంకాక్, బాలీ ద్వీపాల్లో సరదాల కోసం ఖర్చు చేసేందుకు ఇటీవల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇర్ఫాన్ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీతో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్ పేట ప్రాంతాల్లో ఐదు చోట్ల దొంగతనాలు చేయగా అన్ని దొంగతనాలకు ఈ బెంజ్ కారులోనే వచ్చినట్లుగా తేలింది. ఎమ్మెల్యే కాలనీలో దొంగతనం చేసినప్పుడు ఓ చెట్టుకింద కారును అప్పట్లోనే బంజారా హిల్స్ క్రైం పోలీసులు గుర్తించినా దొంగ ఈ కారులో ఎందుకు వస్తాడులే అనుకుని వదిలేశారు. తాజాగా బెంగళూరు పోలీసుల విచారణలో ఎమ్మెల్యే కాలనీకి దొంగతనానికి తాను బెంజ్ కారులో వెళ్లినట్లుగా చెప్పడంతో ఇక్కడి క్రైం పోలీసులు ఉలిక్కి పడ్డారు.
బెంగళూరు పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ ఘరానా దొంగ ఇర్ఫాన్ ను విచారిస్తున్న కొద్దీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో చేసిన దొంగతనాల చిట్టా బయటికొస్తోంది. తాజాగా ఇర్ఫాన్ ను విచారించిన పోలీసులకు ఏడాది క్రితం ఎమ్మెల్యే కాలనీలో చేసిన దొంగతనాలతో కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. బంజారాహిల్స్ రోడ్ నెం.2లో మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి సోదరుడి కొడుకు తిక్కవరపు ఉత్తమ్ రెడ్డి నివాసంలో ఆగస్టు 28న రూ.2కోట్ల విలువ చేసే ఆభరణాలు దొంగిలించి పరారైన ఘటనలో నిందితుడు బెంగళూరు పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తమ్ రెడ్డి నివాసంతో పాటు గత జూలై 22వ తేదీన జూబ్లీహిల్స్ రోడ్ నెం.28లో నివసించే విల్లామేరీ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఫిలోమినా ఇంట్లో దొంగతనం చేసి రూ.30లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించింది ఇర్ఫాన్ గా గుర్తించారు.
ఆగష్టు 24వ తేదీన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదిత్య ఎన్క్లేవ్లో నివసించే జగదీష్ ఇంట్లో రూ.25 లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైంది కూడా ఇర్ఫానే అని పోలీసులు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ మూడు దొంగతనాలు చేసి పరారైన ఇర్ఫాన్ ఇక్కడి పోలీసులకు సవాల్ గా మారాడు. ఈ నేపథ్యంలోనే ముంబైలో పోలీసుకుల చిక్కాడు. విచారించగా 2018 ఆగష్టు 9వ తేదీన బంజారాహిల్స్ రోడ్ నెం.12లోని ఎమ్మెల్యే కాలనీలో నివసించే శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోదరుడు వెంకట్ రెడ్డి ఇంట్లో రూ.10లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి మరుసటిరోజే ఎమ్మెల్యే కాలనీలో నివసించే డాక్టర్ రామారావు ఇంట్లో రూ.50లక్షల విలువ చేసే ఆభరణాలు తస్కరించి పరారైనట్లు తేలింది.
హైదరాబాద్ లో అయిదు చోట్ల చేసిన దొంగతనాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ఆభరణాలు తస్కరించినట్లు గుర్తించారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు తలాబ్ కట్టలో నివసించే సన్నిహితుడు సాజిద్, ముజాఫర్ ల వద్ద ఆశ్రయం పొందాడని తేలడంతో ఆ ఇద్దరినీ సీసీఎస్ పోలీసులు రెండు వారాల క్రితం అరెస్ట్ చేశారు. మరింత లోతుగా ఇర్ఫాన్ ను విచారించగా ఢిల్లీ, గుర్గావ్, ముంబై, బెంగళూరుతో పాటు హైదరాబాద్ లో మొత్తం 20 దొంగతనాలు చేసినట్లుగా తేలింది. హైదరాబాద్ లో సీసీ ఫుటేజీల్లో తన ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న ఇర్ఫాన్ ను పట్టుకునేందుకు నెల రోజు నుంచి నగర పోలీసుల ముమ్మరంగా గాలిస్తుండగానే బెంగళూరులో పట్టుబడ్డ ఓ దొంగద్వారా అక్కడిపోలీసులు ముంబైలో తలదాచుకున్న ఇర్ఫాన్ ను చాకచక్యంగా పట్టుకున్నారు. ప్రస్తుతం బెంగళూరు పోలీసులు లోతుగా విచారిస్తూ ఇంకా ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాడనే విషయాలపై ఆరా తీస్తున్నారు.