Noida Twin Towers: ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వంసిద్ధం.. మధ్యాహ్నం 2.30 గంటల తరువాత నేలమట్టం కానున్న టవర్స్..
నోయిడాలోని సూపర్టెక్ ట్విన్ టవర్లు ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ పేలుడుతో నేలమట్టం కానున్నాయి. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి, పక్కనే ఉన్న నిర్మాణాలు పేలుడుకు దెబ్బతినకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. పేలుడు ప్రారంభించిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే టవర్స్ కుప్పకూలనున్నాయి.

tWIN TOWRS
Noida Twin Towers: నోయిడా సూపర్ టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో దేశంలోనే అతి పెద్ద సూపర్ టెక్ ట్విన్ టవర్స్ నేలమట్టం కానుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 2:45 మధ్యలో ట్విన్ టవర్స్ ను కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ టవర్స్ ను కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. కూల్చివేత ప్రారంభమైన 12:30 సెకన్లలో టవర్స్ నేలమట్టం కానున్నాయి. కూల్చివేతల సందర్భంగా టవర్స్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలను, ఎమరాల్డ్ కోర్ట్, ఏటీఎస్ విలేజ్ ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. సాయంత్రం 4గంటల తరువాతే తిరిగి అక్కడి ప్రజలు వారి నివాసాలకు చేరుకొనే అవకాశం ఉంది.

Noida Twin Tower
కూల్చివేతల పరిసర ప్రాంతాల్లోని హౌసింగ్ సొసైటీలో అండర్ గ్రౌండ్ గ్యాస్, విద్యుత్ నిలిపివేశారు. ట్విన్ టవర్స్ వద్ద నో ఫ్లైయింగ్ జోన్ అమలు చేయడంతో పాటు, చుట్టుపక్కల 500 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ ట్విన్ టవర్స్ ను ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ సంస్థ కూల్చివేయనుంది. గతంలో ఎడిఫెస్ ఇంజనీరింగ్ సంస్థ తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్ రాష్ట్రంలోని పాత మొతెరా స్టేడియంను కూల్చివేతలు చేపట్టింది.

Supertech twin towers
తొమ్మిదేళ్లుగా సాగిన న్యాయ పోరాటం తర్వాత ట్విన్ టవర్లను కూల్చివేస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా నిర్మించినందుకుగాను సుప్రీంకోర్టు ఆదేశాలతో ట్విన్ టవర్స్ ను కూల్చివేస్తున్నారు. సూపర్ టెక్ సంస్థ కుతుబ్ మినార్ కంటే ఎత్తులో ఈ టవర్స్ ను నిర్మించింది. నోయిడాలోని సెక్టార్ 93ఎలో ఉన్న ట్విన్ టవర్స్ లో ఒక్కో టవర్లో 40 అంతస్తులు నిర్మించాలని బిల్డర్ ప్లాన్ చేశారు. కోర్టు ఆదేశాల కారణంగా కొన్ని అంతస్తులు నిర్మించలేకపోయినా, పేలుడుకు ముందు కొన్ని మాన్యువల్గా విరిగిపోయాయి.

Supertech Twin Towers in Sector 93A
టవర్లలో ఒకటైన అపెక్స్ ఇప్పుడు 32 అంతస్తులను కలిగి ఉంది. మరొకటి సెయేన్ టవర్ 29 అంతస్తులు కలిగి ఉంది. అపెక్స్ 103 మీటర్ల పొడవు ఉండగా, సెయానే 97 వద్ద ఉంది. ప్లాన్ ప్రకారం 900+ ఫ్లాట్లు ఉన్నాయి. వీటిలో మూడింట రెండు వంతులు విక్రయించారు. నిర్మాణంలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి వడ్డీతో సహా వాపసు ఇవ్వాలని డెవలపర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Greater Noida Express way
ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను ఉపయోగించనున్నారు. రెండు టవర్లలో 9600 పైగా రంద్రాల్లో పేలుడు పదార్థాలను అమర్చారు. కాంక్రీటును పగలగొట్టే స్థాయిలో డిటోనేటర్లు, ఎమల్షన్లు, షాక్ట టూబులు అమర్చారు. ఇంప్లోజన్ టెక్నిక్ తో భవనాలను నేలమట్టం చేయబోతున్నారు. పేలుడు జరిగిన ఎనిమిది సెకన్లు తరువాత నాలుగైదు సెకన్లలో పూర్తిగా భవనాలు కిందకు పడిపోతాయని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. జంట భవనాల కూల్చివేతలో 40 మంది శిక్షణ కలిగిన ఇంజనీర్లు పాల్గొంటున్నారు.

twin tower
ఈ టవర్స్ కూల్చివేతతో 55వేల టన్నుల నిర్మాణ శిథిలాలు తొలగించాల్సి ఉంటుంది. భవన శిథిలాల్లో దాదాపు 4 వేల టన్నుల ఉక్కు ఉంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు 110 కి.మి పొడవైన జియో-టెక్స్టైల్ కవరింగ్, సుమారు 225 టన్నుల ఇనుప మెష్ ను ఇంజనీర్లు వాడుతున్నారు. మొత్తం 35 వేల ఘనపు మీటర్ల వ్యర్థాలు వస్తాయని, వీటిలో 21 వేల ఘనపు మీటర్ల వ్యర్థాలను ఐదారు హెక్టార్ల ఖాళీ స్థలంలో పోస్తామని, మిగిలినది జంట భవనాల వద్దే ఏర్పడే గోతిలో పోస్తామని నోయిడా ప్రాధికార సంస్థ వెల్లడించింది.

Noida Supertech Twin Towers Demolition
ఇదిలాఉంటే ట్విన్ టవర్స్ వద్ద 550 మంది పోలీసులు, ఇద్దరు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటో ఉంటాయి. అదేవిధంగా 100 వాటర్ ట్యాంకర్లు, దుమ్మును చెదర గొట్టడానికి 15 స్మాగ్ గన్స్ అందుబాటులో ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు కూల్చివేతల ప్రాంతంలో ఉంచారు. నోయిడా ఎక్స్ ప్రెస్ వే ను గంట పాటు మూసివేయనున్న ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.