Madhya Pradesh : ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారం.. ఆపై వీడియో చిత్రీకరణ, బయటికి చెబితే చంపేస్తామని బెదిరింపులు
కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
Two Girls Assault : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. మేకలు మేపేందుకు వెళ్లిన ఇద్దరు బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెవా జిల్లా హనుమానా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో 25 రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఘటనకు సంబంధించిన వీడియో ఆదివారం వైరల్ అయింది.
14, 16 ఏళ్లు కలిగిన ఇద్దరు బాలికలు మేకలను మేపేందుకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ తిరుగుతున్న కొందరు వ్యక్తులు ఇద్దరు బాలికలపై అత్యాచారం చేశారు.
ఈ ఘటనకు వీడియో కూడా తీశారు. ఎవరికైనా ఈ విషయం బయటికి చెబితే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు.
సోమవారం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఐపీసీ, పోక్సో చట్టాల కింద వారిపై కేసు నమోదు చేశారు.