UP Students : ఇంటర్ పరీక్షల్లో జై శ్రీరామ్ అని రాసిన వారికి ఫస్ట్ క్లాస్.. ప్రొఫెసర్ల సస్పెండ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన ఇంటర్ పరీక్షల్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. కొందరు విద్యార్థులు సమాధాన పత్రాల్లో ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయకుండా జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లను రాశారు. సాధారణంగా ఇలా రాస్తే ఎక్కడైనా ఫెయిల్ చేస్తారు. కానీ అక్కడి ప్రొఫెసర్లు మాత్రం సదరు విద్యార్థులను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశారు.
అయితే.. ఈ విషయం ఎక్కువ రోజులు దాగలేదు. వారి బాగోతం బయటపడింది. విద్యార్థులను పాస్ చేసేందుకు ప్రొఫెసర్లు డబ్బులు వసూలు చేసినట్లుగా తెలిసింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జాన్పూర్లోని వీర్ బహదూర్ పూర్వాంచల్ విశ్వ విద్యాలయంలోని ఇద్దరు ప్రొఫెసర్లను సస్పెండ్ చేశారు.
యూనివర్సిటీలోని కొందరు అధికారుల అండతో సున్నా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా 60 శాతానికి పైగా మార్కులతో ఉత్తీర్ణులయ్యారని విద్యార్థి నాయకుడు దివ్యాంశు సింగ్ ప్రధాని, ముఖ్యమంత్రి, గవర్నర్, వైస్ ఛాన్సలర్లకు పంపిన లేఖలో ఆరోపించారు. ఇందుకు ఆర్టీఐ స్పందించి జవాబు పత్రాలను రీ వ్యాల్యుయేషన్ చేయించింది. దీంతో అసలు విషయం బటయపడింది.
దీనిపై యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వందనా సింగ్ మాట్లాడుతూ.. ‘విద్యార్థులకు ఎక్కువ మార్కులు ఇచ్చారనే ఆరోపణ ఉంది. అందుకే మేము ఓ కమిటీ ఏర్పాటు చేశాము. ఆ కమిటీ తన నివేదికలో విద్యార్థులకు ఎక్కువ మార్కులు కేటాయించినట్లు పేర్కొంది’ అని చెప్పారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా.. జై శ్రీరాం నినాదాలతో ఉన్న సమాధాన పత్రాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.