Sonam Wangchuk : విజయంతో పాటు వినయం కూడా ఉండాలి : సీజీపీ సంబరాలపై సోనమ్ వాంగ్చుక్ హితవు!
Sonam Wangchuk : సీజేపీ సంబరాలకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలపై పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ స్పందించారు. విజయంలో వినయం కూడా ఉండాలన్నారు. ఇతరులను నొప్పించే చర్యలకు దూరంగా ఉండాలని మద్దతుదారులను కోరారు.
Sonam Wangchuk
Sonam Wangchuk : లడఖ్ ఉద్యమానికి సంబంధించి వచ్చిన విజయాన్ని వినయంతో స్వీకరించాలని కార్యకర్తలు, మద్దతుదారులకు పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్ సూచించారు. నిరసన ముగిసిన తర్వాత హోటల్లో జరిగిన సంబరాల వీడియోలు వైరల్ కావడంపై ఆయన స్పందించారు.
విజయోత్సాహంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ప్రేమ, విశాల హృదయంతో ముందుకు సాగాలని కోరారు. “విజయం వినయంతో కలిసి ఉండాలి. ఎవరి భావాలను గాయపరిచేలా వ్యవహరించకూడదు. ప్రేమతో, పెద్ద మనసుతో ముందుకు సాగాలి” అని వాంగ్చుక్ మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు.
నిరసన సందర్భంగా 26 రోజుల నిరాహార దీక్ష చేపట్టిన వాంగ్చుక్.. కేంద్ర మంత్రుల సమక్షంలో దీక్ష విరమించడంపై వచ్చిన విమర్శలను లడఖీ సంప్రదాయాలపై అవగాహన లోపంగా అభివర్ణించారు. లడఖ్లో ప్రభుత్వ ప్రతినిధి లేదా ఉన్నత స్థాయి నేత నిరాహార దీక్షను విరమింపజేస్తే.. దానిని ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించిన సంకేతంగా భావిస్తారని ఆయన వివరించారు.
శాంతిమార్గమే విజయానికి కారణం :
లడఖ్ సంప్రదాయం ప్రకారం.. ఒక పెద్ద నేత మీ ఉపవాసాన్ని విరమింపజేస్తే.. అది విజయానికి సూచనగా భావిస్తారు. అలా జరగనప్పుడు చిన్నారి లేదా వృద్ధుల చేతుల మీదుగా దీక్షను ముగిస్తాం’ అని సోనమ్ తెలిపారు. శాంతియుత మార్గంలో సాగిన ఉద్యమమే విజయానికి కారణమని వాంగ్చుక్ అన్నారు.
లాఠీలు, ఘర్షణల వల్ల కాకుండా గాంధీ మార్గంలో సాగిన నిరసన వల్లే ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అహింసా మార్గాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సరిపోతుందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. అది కేవలం ప్రారంభం మాత్రమేనని అన్నారు.
రాజీనామా ఒక ఆరంభం మాత్రమే :
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, శాంతియుత నిరసనకారులపై ఎలాంటి చర్యలు తీసుకోబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజీనామా ఒక ఆరంభం మాత్రమే. సంస్కరణలు దేశాన్ని మరింత మెరుగుపరుస్తాయి.
ప్రతిపాదిత చట్టాలపై పార్లమెంటులో సమగ్ర చర్చ జరగాలన్నారు. కాగా, ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రి నుంచి గురుగ్రామ్లోని మెదాంత ఆసుపత్రికి తరలించిన వాంగ్చుక్ను సోమవారం డిశ్చార్జ్ చేశారు. జూలై 18న పోలీసులు ఆయనను సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు.
విద్యార్థుల డిమాండ్లపై కేంద్రం హామీలు ఇవ్వడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్కరణల కోసం కమిటీ ఏర్పాటు చేయడం, శాంతియుత నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకోవడం, విద్యార్థులపై చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడంతో సీజీపీ నేతృత్వంలోని 36 రోజుల ఉద్యమం ముగిసింది. జూన్ 28న ఉద్యమంలో చేరిన వాంగ్చుక్, ఆస్పత్రి చేరే ముందు 26 రోజుల పాటు నిరాహార దీక్ష కొనసాగించారు. కేంద్ర ప్రకటనల అనంతరం గురువారం రాత్రి ఆయన తన దీక్షను విరమించారు.
