చైనా, పాకిస్థాన్ వణకాల్సిందే.. మోస్ట్ డేంజరస్ రాకెట్ లాంచర్ను పరీక్షించనున్న భారత్
దీనికి శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేసేంత శక్తి ఉంటుంది.

భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అత్యాధునిక గైడెడ్ రాకెట్ వ్యవస్థ పినాక ఎంకే-3ను అభివృద్ధి చేసింది. ఈ అధునాతన రాకెట్ 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కచ్చితంగా ఛేదిస్తుంది. ఈ వ్యవస్థ భారత సైన్యానికి ఒక గేమ్ ఛేంజర్ అవుతుంది. దీన్ని భారత్ త్వరలోనే పరీక్షించనుంది.
చైనా, పాకిస్థాన్కు దీని ద్వారా చెక్ పెట్టొచ్చు. పుణెలోని డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, ఇతర పరిశోధన ప్రయోగశాలలతో పినాక ఎంకే-3ను అభివృద్ధి చేసింది. ఇది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ సిస్టమ్. పినాక సిరీస్లో అత్యాధునిక వెర్షన్ ఇది.
గతంలో అభివద్ధి చేసిన ఎంకే 1.. 40 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఎంకే-2 60-90 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను, గైడెడ్ పినాక 75-90 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇప్పుడు అభివృద్ధి చేసిన పినాక ఎంకే-3 సిస్టమ్ ఏకంగా 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేస్తుంది. 250 కిలోల వార్హెడ్ను మోసుకెళ్లి దాడులు చేసే సత్తా దీనికి ఉంది.
శత్రు దేశాల కమాండ్ కేంద్రాలు, బంకర్లు, సరఫరా సెంటర్లను ఇది నాశనం చేస్తుంది. ఈ రాకెట్ వ్యాసం 300 మిల్లీమీటర్లుగా ఉంటుంది. పాత రాకెట్ వ్యాసం 214 మిల్లీమీటర్లు. ఈ కొత్త రాకెట్ సిస్టమ్లో డీఆర్డీవోకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అభివృద్ధి చేసిన హైటెక్ గైడెన్స్, నావిగేషన్, కంట్రోల్ కిట్ను వాడారు.
కొత్తగా అభివృద్ధి చేసిన పినాక ఎంకే-3ను ఇప్పటికే మనదేశంలో ఉన్న పినాక లాంచర్ల నుంచే ప్రయోగించే అవకాశం ఉంటుంది. పినాక ఎంకే-3 అదనపు ఖర్చులను సైతం తగ్గిస్తుంది. ప్రతి లాంచర్ 8 గైడెడ్ రాకెట్లను మోసుకెళ్లి దాడులు చేస్తుంది. 44 క్షణాల్లో టార్గెట్లను ఛేదిస్తుంది.
మరోవైపు చైనాపీహెచ్ఎల్-03 పరిధి 70–130 కిలోమీటర్లు మాత్రమే. అలాగే, పాకిస్థాన్ ఏ-100 రేంజ్ 120 కిలోమీటర్లు. మన పినాక ఎంకే-3 మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) వ్యవస్థ. దీనికి శత్రు దేశాల కమాండ్ సెంటర్లు, బంకర్లు, సరఫరా కేంద్రాలను నాశనం చేసేంత శక్తి ఉంటుంది.