One Nation One Election: ఒకే దేశం.. ఒకే ఎన్నికపై దేశంలోని నాయకులు ఏమన్నారంటే?

బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఒక దేశం-ఒకే ఎన్నికల'కు మద్దతు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని అన్నారు

2024 Elections: ‘ఒకే దేశం, ఒకే ఎన్నికలు’ అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశంపై అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రకటన చేసిన మర్నాడే కమిటీ చీఫ్ గా నియామకమైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పనిలోకి దిగిపోయారు. ఆదివారం ఆయన న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. మరోవైపు దీనిపై విపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై ఎవరెవరు ఏ విధంగా స్పందించారో ఓసారి చూద్దాం.

రాహుల్ గాంధీ
‘ఇండియా.. అంటే భారత్.. రాష్ట్రాల సమితి. ఒకే దేశం-ఒకే ఎన్నిక ఆలోచన అనేది మనదేశ సమాఖ్య స్ఫూర్తితో పాటు, రాష్ట్రాలపై దాడి చేయడమే అవుతుంది’ అని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మల్లికార్జున్ ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దీనిని వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్య భారతదేశం క్రమంగా నియంతృత్వంగా మారాలని మో్ై ప్రభుత్వం కోరుకుంటోందని అన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికలపై కమిటీ వేయడం అనే ఈ జిమ్మిక్ భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని నాశనం చేసే ఎత్తుగడని విమర్శించారు.

జేడీయూ
ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అనేది ద్రవ్యోల్బణం, ఉపాధిపై వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి బీజేపీ పన్నిన నాటకమని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) ఆరోపించింది. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చర్చనీయాంశమని, అన్ని పార్టీలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోకూడదని బీహార్ మంత్రి అశోక్ చౌదరి అన్నారు.

తేజస్వి యాదవ్
ఆర్జేడీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ ఒక దేశం, ఒకే ఎన్నికలు చేసే ముందు, ఒకే దేశం, ఒకే ఆదాయం చేయండని అన్నారు. ముందుగా అందరికీ ఒకే ఆదాయం ఉండాలని, ఆ తర్వాత ఒక దేశంలో ఒకే ఎన్నికలు అనే చర్చ జరగాలని సూచించారు.

అఖిలేష్ యాదవ్
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. ముందుగా దేశంలోనే అత్యధిక లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఇది అమలు చేసి చూడాలని సూచించారు. ఇది ఒకవైపు ఎన్నికల సంఘం సామర్థ్యంతో పాటు ప్రజాభిప్రాయ ఫలితాలను వెల్లడిస్తుందని, మరోవైపు బీజేపీపై ప్రజల్లో ఎంత కోపం ఉందో, దాన్ని తొలగించేందుకు ఎంత తహతహలాడిందో కూడా బీజేపీకి తెలుస్తుందని ఆయన అన్నారు.

కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
కమిటీ ఏర్పాటు పూర్తిగా అప్రజాస్వామికమని కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేర్కొంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుజన్‌సింగ్ చక్రవర్తి మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు విఘాతం కలుగుతోందన్నారు. ఇలాంటి కమిటీ వేయడం ప్రజాస్వామ్యం కాదని, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో సహా భారతదేశాన్ని చూసి బీజేపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు.

బీజేడీ
లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా చట్టం చేస్తే ఆ నిర్ణయంపై దేశంతో పాటు వెళ్తామని ఒడిశా పేర్కొంది. ఒకవైపు విపక్ష పార్టీలన్నీ దీనిపై ఒంటికాలిపై లేస్తుంటే.. బీజేడీ మద్దతు ఇవ్వడం గమనార్హం. ఒకేసారి ఎన్నికలు ఎప్పుడు జరిగినా పార్టీ ఆందోళన చెందదని మాజీ మంత్రి, బీజేడీ ఎమ్మెల్యే బద్రీనారాయణ్ పాత్ర అన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ
దేశానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్ వన్ ఎడ్యుకేషన్, ఒకే దేశం ఒకే చికిత్స దేశానికి ముఖ్యమైనది అని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పేదవారైనా అందరికీ సమానమైన గౌరవం లభించాలని అన్న ఆయన.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల సామాన్యుడికి ఏం లభిస్తుందని ప్రశ్నించారు.

వైఎస్సార్‌సీపీ
ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) కూడా కేంద్రానికి మద్దతు ఇచ్చింది. ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే కాన్సెప్ట్‌లో అనేక సానుకూల అంశాలు ఉన్నాయని, వేల కోట్ల రూపాయలను ఆదా చేయడమే అతిపెద్ద విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నందున దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని అన్నారు.

డీఎంకే
తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఒకే దేశం, ఒకే ఎన్నికలను వ్యతిరేకించింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు దేశ ప్రయోజనాలకు విరుద్ధమని డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై అన్నారు. ఈ ఆలోచనను ప్రధాని నరేంద్రమోదీ అందించినప్పటి నుంచి డీఎంకే వ్యతిరేకిస్తోంది.

అన్నాడీఎంకే
ఈ ప్రతిపాదనకు తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ, బీజేపీ మిత్రపక్షమైన అన్నాడీఎంకే మద్దతు తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి కె పళనిస్వామి మాట్లాడుతూ, ఈ ప్రతిపాదన మన దేశ అభివృద్ధి వేగాన్ని పెంచుతుందని, రాజకీయ అస్థిరతను నివారిస్తుందని తమ పార్టీ గట్టిగా సమర్థిస్తోందని అన్నారు. ఏకకాల ఎన్నికల వల్ల సమయం ఆదా అవుతుందని అన్నారు.

శిరోమణి అకాలీదళ్
శిరోమణి అకాలీదళ్ కూడా దీనికి మద్దతు ఇచ్చింది. తమ పార్టీ ఈ విధానానికి అండగా ఉన్నామని పార్టీ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. ప్రతి రోజూ ఏదో ఒక ఎన్నికలు జరుగుతుంటాయని, ఐదేళ్ల పాటు ఎన్నికలు జరగకుండా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని అన్నారు.

జననాయక్ జనతాపార్టీ
హర్యానాకు చెందిన జననాయక్ జనతా పార్టీ కూడా దీనికి మద్దతు పలికింది. పార్టీ నాయకుడు, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా మాట్లాడుతూ తమ జననాయక్ జనతా పార్టీ (జెజెపి) ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే ఆలోచనకు మద్దతు ఇస్తుందని, ఎందుకంటే ఇది వేర్వేరు ఎన్నికల నిర్వహణ ఖర్చును తగ్గిస్తుందని అన్నారు.

శివసేన (ఉద్ధవ్ థాకరే)
దేశంలోని నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి సమస్యల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నమని శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఈ సమస్యను పరిశీలిస్తున్న మూడు నివేదికలు ఐదు రాజ్యాంగ సవరణలు, రాష్ట్ర అసెంబ్లీలు, పార్లమెంటులో మూడు వంతుల మెజారిటీ, ఈవీఎంలు, VVPAT ల కోసం 15,000 కోట్ల రూపాయల వ్యయం అవసరమని చెబుతున్నాయని, కాబట్టి కొత్త కమిటీ అవసరమా? మీరు ఎవరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.

ఎంజీపీ
దీనిపై మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజిపి) సానుకూలంగా స్పందించింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే నిర్ణయం అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడంలో ఎంతగానో దోహదపడుతుందని ఆ పార్టీ అధ్యక్షుడు దీపక్ ధవలికర్ అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎన్నికల వ్యయాన్ని తగ్గించడమే కాకుండా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే అమలు చేయడాన్ని నివారించవచ్చని అన్నారు.

ఆర్‌ఎల్‌జేపీ
రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పశుపతి కుమార్ పరాస్ దీనిని సమర్ధిస్తూ, ప్రధాని మంచి నిర్ణయం తీసుకున్నారని, భవిష్యత్తులో ఇది మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని నేను నమ్ముతున్నానని అన్నారు.

బీజేపీ నేతలు
బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’కు మద్దతు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని అన్నారు. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల సుస్థిరతతోపాటు అభివృద్ధికి డైనమిక్ ప్రభుత్వం కూడా అవసరమని అన్నారు. ఈ దృక్కోణంలో, ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ అనేది ప్రశంసించదగ్గ ప్రయత్నమని కొనియాడారు.

నేషనల్ కాన్ఫరెన్స్ స్టాండ్ ఏమిటి?
జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ‘ఒక దేశం, ఒకే ఎన్నికలు’ ప్రతిపాదనపై పార్టీకి కొంత రిజర్వేషన్లు ఉన్నాయని, అయితే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కొత్తగా ఏర్పాటైన కమిటీ తన నివేదికను సమర్పించిన తర్వాత మాత్రమే తమ అభిప్రాయం వెల్లడిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఇమ్రాన్ నబీ అన్నారు.