రాత్రి సమయాల్లో ప్రయాణించే మహిళలకు పోలీస్ ఎస్కార్ట్ ఇవ్వాలని యూపీ పోలీసులు నిర్ణయించారు. మహిళలపై జరగుతున్న హంసలకు ఉత్తరప్రదేశ్ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. దీంతో యూపీ పోలీసులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒంటరిగా వెళ్లే మహిళలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 వరకూ ఒంటరిగా వెళ్లే మహిళలకు మాత్రమే ఎస్కార్ట్ ఇస్తామని యూపీ డీజీపీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు.
మహిళలు వారి గ్యమస్థానానికి ఒంటరిగా వెళ్లాల్సి వస్తే..వారికి పోలీస్ రెస్పాన్స్ వెహికల్స్ లో ఎస్కార్ట్ ఇవ్వనున్నట్లు యూపీ డీజీపీ ఓపీ సింగ్ తెలిపారు. దీనికి సంబంధించి యూపీలోని అన్ని పోలీసు స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు. 112కు డయల్ చేస్తే పోలీసు రెస్పాన్స్ వెహికిల్స్(PRV)కు సమాచారం అందుతుందని.. అనంతరం ఫోన్ చేసిన మహిళ వివరాలు తెలిపితే..ఆ ప్రదేశం నుంచే ఎస్కార్ట్ ను పంపిస్తారనీ దీంతో మహిళలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు.
పోలీసు రెస్పాన్స్ వెహికిల్స్ లో ఇద్దరు మహిళా పోలీసులు తప్పనిసరిగా ఉంటారు. ఈ సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఎదుర్కోవటానికి మహిళా పోలీసులకు స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇచ్చామని తెలిపారు. గత వారం యూపీలోని ప్రైవేటు కంపెనీలతో డీజీపీ సమావేశమై మహిళా ఉద్యోగినుల భద్రతపై చర్చించారు. మహిళా ఉద్యోగినుల సురక్షిత ప్రయాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రైవేటు కంపెనీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.