ప్రకాశం : జిల్లాలో వైవీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ చెక్ పెట్టనుందా ? వైవీ స్థానంలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్లాన్ రెడీ అయిందా ? వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశలు వదులుకోవాల్సిందేనా ? వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థిత్వాన్ని నేతలంతా వ్యతిరేకిస్తున్నారా ? ఒక వేళ సుబ్బారెడ్డికి టికెట్ ఇస్తే…సొంత పార్టీ నేతలు దగ్గరుండి ఓడిస్తారా ? అనే దానిపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో…వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు ఎంపీగా విజయం సాధించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్కు మంచి పట్టు ఉండటంతో…15వేల ఓట్ల తేడాతో సుబ్బారెడ్డి గెలుపొందారు. ఎంపీగా గెలుపొందిన తర్వాత ప్రకాశం జిల్లాలో రాజకీయాలు…తన కనుసన్నల్లోనే జరగాలన్న ఆధిపత్యం ప్రదర్శించారు. ఈ కారణంగా వైవీ సుబ్బారెడ్డి…ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో…వర్గాలను పెంచి పోషించారన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఇప్పటి వరకు ఒక వర్గంగా ఉన్న పార్టీ…వైవీ దెబ్బకు రెండు వర్గాలు తయారైందన్న ప్రచారం జరుగుతోంది. ఒక వర్గానికి మరో వర్గం సహకరించకపోతే…ఎన్నికల్లో ఆ పార్టీ గెలుపు అవకాశాలను భారీగా దెబ్బ తీసే అవకాశముందని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రతి అసెంబ్లీలో రెండు వర్గాలు
బాలినేని, వైవీ సుబ్బారెడ్డి మధ్య కోల్డ్వార్
ఒంగోలు స్థానం నుంచి బరిలోకి షర్మిల
అసంతృప్తులంతా ఏకతాటిపైకి వస్తారన్న పీకే టీం
షర్మిల పోటీ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ప్రభావం
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి ఒకర్ని తెరపైకి తెస్తే….వైవీ సుబ్బారెడ్డి మరొకర్ని తీసుకొస్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్లో ప్రతి చోట రెండు వర్గాలు తయారయ్యాయి. ఒక వర్గం చేసే పనులు…మరో వర్గానికి అసలు పడటం లేదు. జిల్లాలో శ్రీనివాస్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మధ్య జరుగుతున్న కోల్డ్వార్….వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుందని వర్గాలు వాపోతున్నాయి. ఇదే విషయాన్ని అధినేత జగన్కు…కొంత మంది నేతలు ఫిర్యాదు చేశారు. మరోవైపు గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలపై సర్వే చేసిన పీకే టీం….ఒంగోలు పార్లమెంట్ స్థానం నుంచి షర్మిలను పోటీ చేయిస్తే బాగుంటుందని సూచించినట్లు తెలుస్తోంది. షర్మిలను బరిలోకి దించితే….అసంతృప్తులంతా ఏక తాటిపైకి వస్తారని చెప్పినట్లు సమాచారం. ఇక్కడి నుంచి షర్మిలను పార్లమెంట్కు పోటీ చేయించడం ద్వారా….జిల్లాలో అసెంబ్లీ సీట్లపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.
గిద్దలూరు, మార్కాపురం, ఎరగొండపాలెం, కనిగిరి, దర్శి
ఒంగోలు స్థానాలను కైవసం చేసుకోవచ్చని పీకే టీం అంచనా
వైవీ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవి ఇచ్చే ఛాన్స్
గిద్దలూరు, మార్కాపురం, ఎరగొండపాలెం, కనిగిరి, దర్శి, ఒంగోలు అసెంబ్లీ స్థానాలను ఈజీగా కైవసం చేసుకోవచ్చని పీకే టీం జగన్కు సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి నచ్చజెప్పి…. ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ పదవికి అప్పగించవచ్చని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఒంగోలు నుంచి షర్మిల పోటీ చేయడం ద్వారా….మరోసారి జిల్లాలో టీడీపీకి చెక్ పెట్టవచ్చన్న నిర్ణయానికి వచ్చింది వైసీపీ. వైఎస్ మీద ఉన్న అభిమానం…షర్మిల ఛరిష్మా, పార్టీకి ఉన్న సానుభూతితో షర్మిల ఈజీగా గెలుస్తుందని నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.