యుద్ధానికి సేనాని సిద్ధం : పవన్ కళ్యాణ్ సమర శంఖం

  • Publish Date - March 14, 2019 / 01:10 AM IST

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌…ఎన్నికల యుద్దానికి సిద్ధమయ్యారు. పార్టీ పెట్టిన ఐదేళ్లకు…ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో… జనసేన ఆవిర్భావ సభ వేదికగా సమర శంఖం పూరించేందుకు జనసేనాని రెడీ అయ్యారు. జనసేన స్థాపించిన తర్వాత తొలిసారి సేనాని….ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటూనే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఓ వైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తూనే….మరోవైపు ప్రజలకు దగ్గరయ్యే మేనిఫెస్టోను సిద్ధం చేయడంలో బిజీబిజీగా గడుపుతున్నారు. 
Read Also : మెగాస్టార్ చిరంజీవికి హైకోర్టులో ఊరట

రాజమండ్రిలో జరిగే జనసేన ఆవిర్భావ సభ ద్వారా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు పవన్‌ కల్యాణ్‌. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో మార్చి 14వ తేదీ గురువారం పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సభలోనే పార్టీ మేనిఫెస్టోను ప్రకటించనున్నారు పవన్‌. ఇప్పటికే ప్రకటించిన విజన్‌ మేనిఫెస్టోలో వంటగ్యాస్‌, నెలకు 3వేలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌, కాపులకు 5శాతం రిజర్వేషన్, రైతులకు ఎకరానికి 8వేలు వంటి అంశాలను ప్రకటించారు. వీటితో పాటు అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో వివరించనున్నారు జనసేనాని. అటు వామపక్ష పార్టీలతో సీట్ల సర్దుబాటు…ఈ నెల 16వ తేదీకి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.