చంద్రగిరి ఫైట్ : రీ పోలింగ్‌పై టీడీపీ ఆందోళన

  • Published By: madhu ,Published On : May 16, 2019 / 06:40 AM IST
చంద్రగిరి ఫైట్ : రీ పోలింగ్‌పై టీడీపీ ఆందోళన

Updated On : May 16, 2019 / 6:40 AM IST

చంద్రగిరిలో రాజకీయం హాట్ హాట్‌‌గా సాగుతోంది. ఇక్కడి నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేయడంపై టీడీపీ భగ్గుమంటోంది. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈసీ ఆదేశాలను నిరసిస్తూ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని..టీడీపీ శ్రేణులు తిరుపతిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద 2019, మే 16వ తేదీన గురువారం ధర్నా చేపట్టారు. 

ఈ సందర్భంగా పులివర్తి నాని 10tvతో మాట్లాడుతూ…దళితులను పోలింగ్‌కు ఉంచడం వల్లే రీ పోలింగ్ జరుపుతున్నారని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు. మే 19వ తేదీన జరిగే రీ పోలింగ్‌లో తమకే మెజార్టీ వస్తుందని తెలిపారు. ఓటమి భయంతోనే చెవిరెడి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ఈసీ పక్షపాతంగా వ్యవహరిస్తోందని, వైసీపీ, బీజేపీ కుట్రలు పన్నారనడానికి ఈసీ ఆదేశాలే నిదర్శనమన్నారు పులివర్తి నాని. 

చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని ఎన్‌ఆర్‌ కమ్మపల్లె, కమ్మపల్లె, పులివర్తిపల్లె, కొత్తకండ్రిగ, వెంకట్రామపురంలో… రీపోలింగ్‌కు అనుమతులు జారీ చేసింది. మే 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆయా బూత్‌ల పరిధిలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

చంద్రగిరి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఇటీవల కలిసి… తన నియోజకవర్గంలో ఒక వర్గానికి సంబంధించిన వారి ఓట్లు వేయనీయకుండా చేశారని ఫిర్యాదు చేశారు. దీంతోపాటు మరికొన్ని ఫిర్యాదులు రావడంతో… అక్కడి పరిస్థితులపై నివేదిక తెప్పించుకున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది ఈసీఐకి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ఈసీఐ… ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు అనుమతిచ్చింది.