Yangati Basavanna : యాంగటి బసవన్నవెనుక…అంతుచిక్కని రహస్యం

ఇక్కడ పరమశివుని ఆలయం నిర్మించటానికి ఒక చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశం లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారు.

Yangati Basavanna : యాంగటి బసవన్నవెనుక…అంతుచిక్కని రహస్యం

Yaganti (2)

Updated On : March 1, 2022 / 9:06 AM IST

Yangati Basavanna : ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రాలలో యాగంటి క్షేత్రం ఒకటి. యాగంటిలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద మిస్టరీ దాగుంది. నేటికి దానిని ఛేదించటం ఎవరి వల్ల కాలేదు. అందుకే యాంగటి క్షేత్రం ప్రత్యేకతను సంతరించుకుని భక్తుల పూజలతో విరాజిల్లుతుంది. యాగంటిలో ప్రధాన దేవాలయంలో ఉమామహేశ్వర లింగం కొలువై ఉంది. శివపార్వతులు ఇద్దరూ ఒకే లింగంలో కనిపించడం విశేషం. కర్నూలు జిల్లా కేంద్రానికి వందకిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. నల్లమల అడవుల మధ్య ఈ ఆలయం వెలిసింది.

ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. ఇక్క‌డ సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు పచ్చని వాతావరణం కనిపిస్తుంది. కొండకోనల నడుమ ఈ క్షేత్రం కొలువై ఉంటుంది. ఈ పుణ్య క్షేత్రం లో ప్రముఖంగా చెప్పబడే యాగంటి బసవన్న స్వయంభువుగా వెలిశాడని చరిత్రచెబుతుంది. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది.

ఈ విగ్రహం లో జీవకళ ఉట్టిపడుతుంది. ఈ బసవన్న విగ్రహం ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుందని ఏకంగా పురావస్తు శాఖ నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలను సైతం ఆలయంలో ఏర్పాటు చేశారు. అంతకంతకు పెరిగిపోతుండటం అటు భక్తులను ఆశ్ఛర్యానికి గురిచేస్తుంది. యుగాంతంలో యాగంటిలోని నంది పైకిలేచి రంకె వేస్తుందని బ్రహ్మంగారు చెప్పారని చెప్తుంటారు. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలోనే ఈ యాగంటి క్షేత్రం ఉండటం విశేషం.

ఇక ఈ ఆలయం మరో విశేషమేటంటే ఒక్క కాకి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కాకులు కనిపించకపోవడం వెనుక ఒక పురాణ గాధ ఉంది ..అగస్త్య మహా ముని యాగం చేసేప్పుడు రాక్షసులు కాకి రూపం లో వచ్చి మాంసం ముక్కలను యాగ గుండం లో వేసి ఆటంకం కలిగించారట. దీంతో కోపంతో ఆ మహా ముని ఈ క్షేత్రం లో కాకులు తిరగకూడదని శాపం ఇచ్చాడని చెబుతారు. అప్పటినుంచి ఈ ఆలయం పరిసరాల్లో కాకులు తిరగవు.

ఇక్కడ పరమశివుని ఆలయం నిర్మించటానికి ఒక చరిత్ర ఉంది. చాలా సంవత్సరాల క్రితం ఒక రాజు ఈ ప్రదేశం లో వెంకటేశ్వర స్వామి గుడి కట్టాలని సంకల్పించారు. అదే సమయంలో రాజుకి శివుడు కలలో ప్రత్యక్షమై తనకు ఇక్కడే గుడి కట్టాలని అదేశించాడని, ఆ క్రమంలోనే శివుడు,పార్వతి ఒకే లింగంలో దర్శనమిచ్చేలా ఈ క్షేత్రాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇక అగస్త్య మహాముని చేసిన యాగం వలెనే కాబట్టి ఈ క్షేత్రానికి యాగంటి అని పేరు వచ్చిందని చెప్తారు. శైవ క్షేత్రమే అయినా ఈ ఆలయం వైష్ణవాలయాన్ని పోలి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడి కోసం మొదలు పెట్టింది కాబట్టి శిల్ప చాతుర్యం అంతా వైష్ణవ సంప్రదాయం లోనే ఉంటుంది.

ఈ ఆలయంలో నందీశ్వరుని విగ్రహం ప్రధానమైనది. ఆలయ ప్రాంగణంలో ఉన్న చిన్న కోనేరుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పర్వత సానువుల్లో సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఒక చిన్న నంది విగ్రహం నోటి నుంచి ఆలయ ప్రాంగణంలోని కోనేరు లో చేరుతుంది. కోనేరు లోని నీరు అన్ని కాలాల్లో ఒకే మట్టంలో వుండడం విశేషం. ఇందులోని నీటికి ఔషధ గుణాలున్నాయని, ఇందులో స్నానమాచరిస్తే సర్వ రోగాలు నయమౌతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి పర్వదినం రోజున భక్తులు పెద్ద సంఖ్యలో యాంగటిని సందర్శిస్తారు.