భార్య మంగళసూత్రాన్ని అలా ధరిస్తే భర్తకు ఎటువంటి ఆపదలు రావు

భార్య మంగళసూత్రాన్ని అలా ధరిస్తే భర్తకు ఎటువంటి ఆపదలు రావు

Updated On : December 16, 2020 / 4:46 PM IST

Importance of Mangalasutra : పెళ్ళైన స్త్రీకి అందం, ఐశ్వర్యం మెడలో తాళి బొట్టు. భర్త భార్యకి కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది. భార్య మెడలో మంగళసూత్రం, నుదిటిన సింధూరం భర్త ప్రాణాలను సంతోషాలను కాపాడుతుంది. మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలా చూసుకోవాలి.

వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది. పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి బొట్టు మాత్రమే కడతాడు.

ఆ తర్వాత ఆడవారు మంగళ సూత్రంలో పగడాలు, ముత్యాన్నీ, చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు. అలా ధరించడం ఫ్యాషన్ అని చాలా మంది అనుకుంటారు. అది పొరపాటు. అలా చేయకూడదు. అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక. మంగళ అంటే శుభప్రదం, శోభాయమానం, సూత్రం అంటే తాడు, ఆధారమని అని అర్థం. వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడుముళ్ళను వేస్తాడు. భర్త ఆరోగ్యంగా ఉండాలని, తన సంసారం నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో సాగాలని వధువు మెడలో మూడు ముళ్ళను వేయిస్తారు వేదపండితులు. ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్లు, దేవ దేవతలందరూ నూతన వధూవరులను దీవిస్తారని నమ్మకం.

అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళ సూత్రాలను పక్కనబెడుతున్నారు. మంగళసూత్రం బదులుగా నల్లపూసల హారాన్ని, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా ఉన్న మంగళసూత్రాలను ఉపయోగిస్తున్నారు. దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతున్నారు. నలుపు, బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారట.  నలుపు రంగు వర్ణంలో శివుడు, బంగారు వర్ణంలో పార్వతిదేవి కొలువై ఉంటుంది. ఎటువంటి కీడు జరగకుండా, వధువు సుమంగళిగా ఉండాలని పార్వతీపరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకొనే ఉంటారు.

అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు. హృదయస్థానానికి మంగళసూత్రం తాకుతూ ఉండటం వలన, ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది. మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి, ఎక్కడైనా పోరాడగలను,నెగ్గగలను అనే ధైర్యసాహసాలు కలుగుతాయట. మంగళసూత్ర్రాలలో పసుపుతాడును వాడుతారు. వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమను అద్దుతారు. మంగళసూత్రాలను బంగారువి చేయించుకున్నా, మధ్యలో తాడు మాత్రం పసుపుతాడునే వాడాలి. ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు. పసుపు కుంకుమలలో సర్వమంగళాదేవి ఉంటుందట.

అయితే కొందరు మంగళసూత్రం పైన బొమ్మలు గీయించడం, రంగులు దిద్దిచడం వంటివి చేస్తుంటారు. కొంతమంది లక్ష్మీబొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారుచేసుకుంటారు. అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదానని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకువచ్చేది సీతారాములు.  సీతమ్మ అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి సీతే తన మంగళసూత్రంపై రాముల వారి బొమ్మగాని, రంగులు కానీ వేయించుకోలేదట. సీత ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేయించుకున్నారో అలా చేస్తే ఖచ్చితంగా సిరిసంపదలు కలుగుతాయట.

కొంతమందికి వేంకటేశ్వరస్వామి అంటే ఇష్టం. మరికొందరికి దుర్గాదేవి అంటే ఇష్టం. ఇంకొంతమందికి మిగిలిన దేవుళ్ళంటే ఇష్టం. ఎవరికి ఇష్టమొచ్చిన దేవుడిని మంగళసూత్రంపై తయారుచేసి వేయించుకుంటుంటారు. అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళ సూత్రాలపై వేసుకోకూడదట. ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమను ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదట. కాబట్టి మంగళసూత్రాన్ని మామూలుగా వేసుకోవడం మంచిది.

వాస్తవానికి మంగళసూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో గానీ, పట్టునుంచి వచ్చిన దారంతో గాని చేయాల్సి ఉంది. దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే వుంది. దీనిని ఒక తాంత్రిక విధానంతో, ఒక నాడిని మీ వ్యవస్థ లోంచి, మరొకటి మీకు నిశ్చితార్థం అయినవారి దగ్గర నుంచి తీసి, ఈ సూత్రాన్ని తయారుచేసి కడతారు. ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక, ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది. ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే, ఇంక ఆ బంధాన్ని విడదీయలేరు. ఒకరి నుంచి ఒకరిని విడదీయడమన్నది ఎంతో కష్టమైనది. అలాగే భార్య మెడలోని మంగళసూత్రం భర్తను అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కచ్చితంగా కొన్ని విషయాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది.

ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదోతనాన్ని ఇచ్చే పార్వతి దేవి కటాక్షిస్తుంది. మంగళసూత్రాలకు పిన్నీసులు, ఏ ఇతర ఇనుముకి సంబంధించిన వస్తువులు పెట్టకూడదు. మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందకి ఉండాలి. మంగళసూత్రాలకి ఎప్పుడు ఎరుపు (పగడం) నలుపు పూసలు ఉండాలి.

పొరపాటున మంగళసూత్రం తెగిపోతే(పెరిగితే) వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కాని భర్త చేత కాని వేయించుకోవాలి. ఇంకా ఎవరు లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి ఉదయం 9 గంటల లోపు మళ్లీ మంగళసూత్రాన్ని (బంగారు తాళిని) వేసుకోవాలి. ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది. వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలు చెపుతున్నాయి.

సహకారం
జ్యోతిష్యరత్న.డాక్టర్. శిష్ట్లా నాగేశ్వర శర్మ
జంషెడ్ పూర్.
7903591993