TTD Brahmotsavam : మోహినీ అవతారంలో జగన్మోహనాకారుడు

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామి వారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితు

  • Updated on- October 11, 2021 / 01:38 PM IST

Tirumala Mohini Avataram

TTD Brahmotsavam : తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు సోమవారం ఉదయం 9 గంట‌లకు శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో శ్రీ మలయప్పస్వామి వారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చారు. పక్కనే మరో తిరుచ్చిపై శ్రీకృష్ణుడు అలంకృతుడై అభయమిచ్చాడు.

మొదట రంగనాయకుల మండపంలో పల్లకిలో మోహినీ అవతారంలో ఉన్న స్వామివారిని, శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేశారు. అక్కడి నుండి ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకెళ్లారు.

మోహినీ అవతారం-మాయా మోహ నాశ‌నం ….ఈ అవతారం ద్వారా జగత్తు అంతా మాయామోహానికి లొంగివుందని, అదంతా తన లీలా విలాసమేనని, తన భక్తులు కానివారు ఈ జగన్మాయలోలులు కాక తప్పదని స్వామివారు ఈ రూపంలో చాటి చెబుతున్నారు.

కాగా… ఈ రోజు రాత్రి 7 గంటలకు విశేష‌మైన గరుడవాహనంపై శ్రీ‌మ‌ల‌య‌ప్ప‌స్వామివారు కటాక్షించనున్నారు. గ‌రుడ వాహ‌నం – స‌ర్వ‌పాప ప్రాయ‌శ్చిత్తం ….పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. అంతేగాక జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే భగదధిష్టుతుడైన గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తకోటికి తెలియ చెపుతున్నాడు.