జమ్మూలో త్వరలో శ్రీవారి ఆలయం : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్

  • Publish Date - January 3, 2020 / 06:26 AM IST

విశాఖపట్నంలో 17 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం 2020 మార్చి నాటికి పూర్తి  అవుతుందని టీటీడీఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. మంచి ముహూర్తం నిర్ణయించుకుని ఆలయాన్ని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.  ముంబైలో  30 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న శ్రీవారి ఆలయం నిర్మాణ దశలో ఉందని… జమ్ములో శ్రీవారి ఆలయం నిర్మించాలని పాలక మండలి నిర్ణయం తీసుకుందని సింఘాల్ వివరించారు. 

జమ్మూలో త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేసి ఆలయ నిర్మాణం పనులు ప్రారంభిస్తామని  ఆయన శుక్రవారం తిరుమలలో చెప్పారు. గతేడాది (2019 సంవత్సరంలో) 2 కోట్ల 58 లక్షల 90 వేల179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 12 కోట్ల 49 లక్షల 80 వేల 815 లడ్డూలు పంపిణీ చేశామని… 1151,74 కోట్ల రూపాయల హుండీ ద్వారా ఆదాయం లభించినట్లు ఈఓ వివరించారు. 

శ్రీ వెంకటేశ్వర స్వామివారి  ఆర్జిత సేవలకు సంబంధించిన ఏప్రిల్ నెలలో లభించే  టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 65,280 ఆర్జిత సేవా టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 10,680 సేవా టికెట్లు, ఆన్‌లైన్ జనరల్ కేటగిరీలో 54,600 సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వున్నాయి.  

Also Read : ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల