AUS vs AFG : ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య నేడు కీలక మ్యాచ్.. అఫ్గాన్ గెలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్..!
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది.

Champions Trophy 2025 key Match between Afghanistan and Australia today
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మ్యాచ్లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు గ్రూ-బి నుంచి సెమీస్కు వచ్చే జట్లు ఏవి అన్న విషయం పై స్పష్టత రాలేదు. వర్షం కారణం ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం, ఇంగ్లాండ్ పై అఫ్గానిస్తాన్ గెలవడంతో గ్రూప్-బిలో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో నేడు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. రెండు జట్లకు కూడా గ్రూప్ దశలో ఇదే ఆఖరి మ్యాచ్. ఓడిన జట్టు దాదాపుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
ప్రస్తుతం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండగా అఫ్గానిస్తాన్ మూడో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా, ఆసీస్ ఖాతాలో చెరో మూడు పాయింట్లు ఉన్నప్పటికి మెరుగైన రన్రేట్ కలిగిన దక్షిణాఫ్రికా (+2.140) తొలి స్థానంలో ఉంది. ఆసీస్ నెట్రన్రేట్ +0.475గా ఉంది. ఇక అఫ్గానిస్తాన్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన ఇంగ్లాండ్ సెమీస్ రేసు నుంచి ఎప్పుడో నిష్ర్కమించింది.
ఈ మ్యాచ్లో గనుక అఫ్గానిస్తాన్ గెలిస్తే.. నాలుగు పాయింట్లతో అఫ్గాన్ సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. అయినప్పటికి ఆస్ట్రేలియాకు ఓ ఛాన్స్ ఉంటుంది. శనివారం దక్షిణాప్రికా, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్నమ్యాచ్ ఫలితం పై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో దక్షిణాప్రికా విజయం సాధిస్తే సఫారీలు సెమీస్కు చేరుకుంటారు. ఒకవేళ దక్షిణాఫ్రికా చిత్తు చిత్తుగా ఓడిపోతేనే ఆస్ట్రేలియాకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే సౌతాఫ్రికా నెట్రన్రేట్ ఆసీస్ కంటే కాస్త మెరుగ్గా ఉంది. అలా వేరే మ్యాచ్ ఫలితంపై ఆధారపడకూడదు అని అనుకుంటే నేటి మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించాల్సిందే..
అఫ్గానిస్థాన్ గెలిస్తే భారత్కు కలిగే ప్రయోజనం ఇదే..
ఆస్ట్రేలియా పై అఫ్గానిస్తాన్ గెలిస్తే సెమీస్కు చేరుకుంటుంది. ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా విజయం సాధిస్తే అప్పుడు సఫారీలు గ్రూప్బిలో అగ్రస్థానంతో సెమీస్కు వెలుతుంది. అఫ్గాన్ రెండో స్థానంలో నిలుస్తుంది. అదే సమయంలో ఆఖరి లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ను భారత్ ఓడిస్తే టీమ్ఇండియా గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్కు వెలుతుంది.
అప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిబంధనల ప్రకారం.. గ్రూప్-ఏలో టాపర్గా ఉన్న జట్టు గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో తలపడాల్సి ఉంటుంది. అప్పుడు సెమీస్లో భారత్, అఫ్గానిస్తాన్తో తలపడనుంది. దీంతో భారత్ ఫైనల్ చేరుకునేందుకు అవకాశాలు మరింత మెరుగ్గా ఉంటాయి. దక్షిణాప్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే సెమీస్లో విజేతగా నిలిచిన జట్టుతో భారత్ ఫైనల్లో తలపడనుంది.
అలా కాకుండా నేటి మ్యాచ్లో ఆసీస్ విజయం సాధిస్తే భారత్కు తిప్పలు తప్పవు. ఒకవేళ సెమీస్లో ఆసీస్తో తలపడాల్సి వస్తే అది భారత్కు కష్టం కావచ్చు. ఎందుకంటే గ్రూప్ స్టేజీల్లో ఆసీస్ ప్రదర్శన ఎలా ఉన్నప్పటికి కీలకమైన సెమీస్, ఫైనల్లో ఆస్ట్రేలియా ఎంతో అత్యుత్తమంగా ఆడుతుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు 2023 వన్డే ప్రపంచకప్ చక్కని ఉదాహరణ.
గ్రూప్ స్టేజీలో తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియా.. ఫైనల్లో మాత్రం ఎంతలా చెలరేగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందునే నేటి మ్యాచ్ అఫ్గాన్ గెలవాలని టీమ్ఇండియా అభిమానులు సైతం కోరుకుంటున్నారు.