నాలుగే ప్రశ్నలు.. జవాబు దొరకట్లేదు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ గిల్ సేనకు తలనొప్పి..

4వ స్థానంలో దిగేది ఎవరు?

నాలుగే ప్రశ్నలు.. జవాబు దొరకట్లేదు.. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ గిల్ సేనకు తలనొప్పి..

Gautam Gambhir-Shubman Gill

Updated On : June 13, 2025 / 8:49 PM IST

భారత టెస్ట్ జట్టుకు అసలైన అగ్నిపరీక్ష మొదలుకాబోతోంది. రోహిత్, కోహ్లీ, అశ్విన్ వంటి దిగ్గజాలు లేకుండా భారత్ టెస్టు సిరీస్ ఆడాల్సి ఉంది. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్‌తో వారి గడ్డపైనే ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.

అయితే, జూన్ 20న తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు భారత జట్టు కూర్పుపై నాలుగు కీలక ప్రశ్నలు యాజమాన్యాన్ని, అభిమానులను వేధిస్తున్నాయి. ఆ చిక్కుముడులేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం.

4వ స్థానంలో దిగేది ఎవరు?

భారత టెస్ట్ క్రికెట్‌లో నంబర్ 4 స్థానానికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి మహామహులు ఏలిన ఈ స్థానం ఇప్పుడు ఖాళీగా ఉంది. ఈ కీలక స్థానం కోసం పోటీ తీవ్రంగా ఉంది.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, ఈ స్థానంలో ఆడే ఒక ప్రధాన ప్లేయర్‌గానూ ఉన్నాడు. కానీ విదేశాల్లో అతని ఇటీవలి ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో రాణించిన కరుణ్ నాయర్, యువ సంచలనం సాయి సుదర్శన్, లేదా వికెట్ కీపింగ్ భారం లేకుంటే ధృవ్ జురేల్ కూడా ఈ రేసులో ఉంటారు.

కోహ్లీ వ్యూహమా? బ్యాటింగ్ బలమా?

గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్ల వ్యూహం విజయవంతమైంది. కానీ ఇంగ్లాండ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ డెప్త్ కూడా అంతే ముఖ్యం.

ఐదు బౌలర్ల వ్యూహం: బౌలింగ్ బలంగా ఉంటుంది, కానీ 8వ స్థానం నుంచి బ్యాటింగ్ బలహీనపడుతుంది.

నలుగురు బౌలర్లు + ఆల్‌రౌండర్: బ్యాటింగ్ లోతు పెరుగుతుంది. రవీంద్ర జడేజా 7వ స్థానంలో ఆడటం ఖాయం. 8వ స్థానంలో శార్దూల్ ఠాకూర్ లేదా నితీశ్ రెడ్డి వంటి వారిని తీసుకుంటే జట్టుకు సమతుల్యం వస్తుంది.

లోయర్ మిడిల్ ఆర్డర్ సంగతేంటి?

జట్టు గెలుపోటములను శాసించేది లోయర్ మిడిల్ ఆర్డర్. ఇక్కడ సరైన ఆటగాళ్లను ఎంచుకోవడం చాలా కీలకం.

6వ స్థానం: ఈ స్థానం కోసం ధృవ్ జురేల్, సాయి సుధర్శన్, నితీశ్ రెడ్డి మధ్య పోటీ ఉంది.

7వ స్థానం: రవీంద్ర జడేజాకు ఈ స్థానం ఖాయం.

8వ స్థానం: బ్యాటింగ్ చేయగల బౌలర్ ఇక్కడ అవసరం. శార్దూల్ ఠాకూర్ లేదా వాషింగ్టన్ సుందర్ ను ఎంపిక చేయవచ్చు. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన బౌలర్ అయినప్పటికీ, 8వ స్థానంలో అతడిని దింపడం సరికాదు.

బుమ్రా, సిరాజ్‌కు తోడుగా మూడో పేసర్ ఎవరు?

జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ పేస్ దళాన్ని నడిపించడం ఖాయం. కానీ వారికి అండగా నిలిచే మూడో పేసర్ ఎవరు?

ప్రసిద్ కృష్ణ: ఐపీఎల్‌లో మంచి వేగంతో, ఫామ్‌తో ఆకట్టుకున్నాడు.

అర్షదీప్ సింగ్: ఎడమచేతి వాటం పేసర్ కావడం జట్టుకు వైవిధ్యాన్ని ఇస్తుంది.

శార్దూల్ ఠాకూర్: బంతితో పాటు బ్యాట్‌తోనూ పరుగులు చేయగలడు, ఇది అతనికి ప్లస్ పాయింట్.

బ్యాకప్ ఆప్షన్లు: యువ ఆటగాళ్లు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అంషుల్ కంబోజ్ కూడా రేసులో ఉన్నారు.

ఈ ప్రశ్నలకు టీమ్ మేనేజ్‌మెంట్ ఎలాంటి సమాధానాలు కనుగొంటుందో అనేదానిపైనే సిరీస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. గిల్ కెప్టెన్సీలో ఈ యువ భారత్ ఎలా రాణిస్తుందో చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లాండ్ సిరీస్‌కు భారత టెస్ట్ జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, బుమ్రా, సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.