RR vs GT : రాజస్థాన్కు గుజరాత్ షాక్.. సంజూ సేనకు తొలి ఓటమి
రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది.
RR vs GT : రాజస్థాన్ రాయల్స్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. ఈ సీజన్లో వరుసగా నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న రాజస్థాన్కు గుజరాత్ టైటాన్స్ షాకిచ్చింది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యాన్ని సరిగ్గా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుభ్మన్ గిల్ (72; 44 బంతుల్లో 6ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో కుల్దీప్ సేన్ మూడు వికెట్లు తీశాడు. చాహల్ రెండు, ఆవేశ్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్కు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (24; 19 బంతుల్లో 5 ఫోర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. వరుస బౌండరీలతో హోరెత్తించాడు. అయితే ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్గా పెవిలియన్కు చేరుకున్నాడు. గత మ్యాచ్ శతక హీరో, మరో ఓపెనర్ జోస్ బట్లర్ (10 బంతుల్లో 8 పరుగులు) విఫలం అయ్యాడు. దీంతో రాజస్థాన్ 42 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో ఇన్నింగ్స్ను నిర్మించే బాధ్యతలను కెప్టెన్ సంజు శాంసన్ (68నాటౌట్; 38 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ పరాగ్ (76; 48 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) లు భుజాన వేసుకున్నారు. ఆరంభంలో ఈ జోడి కాస్త ఆచితూచి ఆడింది. కొంచెం కుదురుకున్నాక గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో 34 బంతుల్లో రియాన్ పరాగ్, 31 బంతుల్లో సంజూ శాంసన్లు హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
శతకం దిశగా సాగుతున్న రియాన్ పరాగ్ను మోహిత్ శర్మ ఔట్ చేశాడు. సంజు- పరాగ్ జోడి మూడో వికెట్కు 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పరాగ్ ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన షిమ్రాన్ హెట్మైర్ (13నాటౌట్ 5 బంతుల్లో 1ఫోర్లు, 1సిక్స్) వేగంగా ఆడాడు. దీంతో రాయల్స్ భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్ యాదవ్, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
వన్డే ప్రపంచకప్ 2027కు వేదికలు ఖరారు.. దక్షిణాఫ్రికాలో 8 స్టేడియాల్లో మ్యాచులు