రాజస్థాన్‌పై ముంబై విజయం.. బూమ్రా, యాదవ్‌లే హీరోలు

  • Published By: vamsi ,Published On : October 7, 2020 / 12:03 AM IST
రాజస్థాన్‌పై ముంబై విజయం.. బూమ్రా, యాదవ్‌లే హీరోలు

Updated On : October 7, 2020 / 7:16 AM IST

IPL 2020లో 20వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ రాజస్థాన్‌ను 57 పరుగుల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో ముంబైకి ఇది నాలుగో విజయం కాగా.. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ జట్టు 18.1 ఓవర్లలో 136 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్ అజేయంగా 79 పరుగులు చేయగా.. ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు ఓవర్లలో 20 పరుగులకు నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ విజేతలుగా నిలిచారు.



మొదట బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. డికాక్ 15 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 23 పరుగులు చేయగా.. కార్తీక్ త్యాగి అతన్ని అవుట్ చేశాడు. దీని తరువాత లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ రెండు బంతుల్లో వరుసగా రెండు వికెట్లు పడగొట్టాడు. రోహిత్ శర్మను 35పరుగులకే పెవిలియన్ పంపగా.. తర్వాత వెంటనే ఇషాన్ కిషన్‌ను పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు పంపాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.

ముంబై 88 పరుగులకే తమ మూడు వికెట్లు కోల్పోగా.. మూడో నంబర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ చివరివరకు ఉండి షాట్లు కొట్టాడు. సూర్యకుమార్ 47 బంతుల్లో 79 పరుగులు చేశాడు. తన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌లో సూర్యకుమార్ యాదవ్ సాధించిన అత్యధిక స్కోరు ఇది. అంతకుముందు, అతని అత్యధిక స్కోరు 72 పరుగులు.



రాజస్థాన్ రాయల్స్ తరఫున లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. గోపాల్ తన కోటాలోని నాలుగు ఓవర్లలో 28 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇవే కాకుండా, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి ఒక్కో వికెట్ సాధించారు.

అనంతరం ముంబై నుంచి 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి రాజస్థాన్ బరిలోకి దిగగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండో బంతికే ఖాతా తెరవకుండా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీని తరువాత, 7 పరుగుల స్కోరు వద్ద కేవలం ఆరు పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యాడు. అనంతరం సంజు శాంసన్ కూడా పరుగుల ఖాతా తెరవకుండా ట్రెంట్ బోల్ట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఈ సమయంలో రాజస్థాన్ స్కోరు 12 పరుగులు. మూడు ఓవర్లలోనే ముగ్గురు ముఖ్యమైన ఆటగాళ్లను 12పరుగులకే రాజస్థాన్ కోల్పోయింది.



అయితే, దీని తరువాత, జోస్ బట్లర్, మహిపాల్ లోమోర్ ఇన్నింగ్స్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. లోమోర్‌ కొట్టిన షాట్‌ను అంకుల్ రాయ్ చాలా అద్భుతమైన క్యాచ్‌ను పట్టుకోవడంతో రాజస్థాన్ నాల్గవ వికెట్ కోల్పోయింది. 42 పరుగులకు నాలుగు వికెట్లు పడటంతో జోస్ బాల్ట్లర్ ముంబై బౌలర్లపై దాడికి దిగాడు. బట్లర్ 44 బంతుల్లో 70 పరుగులు చేశాడు. నాలుగు ఫోర్లు మరియు ఐదు సిక్సర్లు అందులో ఉన్నాయి. బట్లర్‌తో పాటు, జోఫ్రా ఆర్చర్ కూడా వేగంగా స్కోరు చేయడానికి ప్రయత్నించాడు. ఆర్చర్ 11 బంతుల్లో 24 పరుగులు చేశాడు.



ముంబై తరఫున జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బోల్ట్ మరియు జేమ్స్ ప్యాటిన్సన్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.