IND vs NZ : తొలి టెస్టులో ప‌ట్టుబిగించిన న్యూజిలాండ్‌.. తృటిలో చేజారిన డేవాన్ కాన్వే శ‌త‌కం..

బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు ప‌ట్టు బిగించింది.

IND vs NZ : తొలి టెస్టులో ప‌ట్టుబిగించిన న్యూజిలాండ్‌.. తృటిలో చేజారిన డేవాన్ కాన్వే శ‌త‌కం..

Bengaluru Test

Updated On : October 17, 2024 / 5:30 PM IST

బెంగ‌ళూరు వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ జ‌ట్టు ప‌ట్టు బిగించింది. తొలుత భార‌త్‌ను మొద‌టి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. అనంత‌రం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన కివీస్‌ రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 3 వికెట్ల న‌ష్టానికి 180 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం కివీస్ 134 ప‌రుగుల ఆధిక్యంలో కొన‌సాగుతోంది. డారిల్ మిచెల్ (14), ర‌చిన్ ర‌వీంద్ర (22) లు క్రీజులో ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, ర‌వీంద్ర జ‌డేజా, కుల్దీప్ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

భార‌త్‌ను త‌క్కువ స్కోరు ఆలౌట్ చేసిన న్యూజిలాండ్‌కు ఆ జ‌ట్టు ఓపెన‌ర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 67 ప‌రుగులు జోడించారు. కెప్టెన్, ఓపెన‌ర్ అయిన టామ్ లాథ‌మ్ (15) ప‌రుగులు చేసేందుకు ఇబ్బంది ప‌డ్డాడు. అయితే.. మ‌రో ఓపెన‌ర్ డేవాన్ కాన్వే భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. వ‌న్డే త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌లో లాథ‌మ్ ఔటైనా విల్ యంగ్‌(33)తో క‌లిసి కాన్వే స్కోరు బోర్డును ముందుకు న‌డిపాడు.

IPL 2025 : ముంబై ఇండియ‌న్స్ రిటైన్ లిస్ట్? రోహిత్ శ‌ర్మ‌పై ఎంఐ కీల‌క నిర్ణయం..

బంగ్లాదేశ్ సిరీస్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన అశ్విన్‌ను టార్గెట్ చేసి ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో స్వీప్‌, రివ‌ర్స్ స్వీప్‌ల‌తో ప‌రుగులు రాబ‌ట్టాడు. రెండో వికెట్‌కు 75 ప‌రుగులు జోడించిన త‌రువాత ర‌వీంద్ర జ‌డేజా బౌలింగ్‌లో కుల్దీప్ యాద‌వ్ క్యాచ్ అందుకోవ‌డంతో విల్ యంగ్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

అయిన‌ప్ప‌టికి కాన్వే ఏ మాత్రం జోరు త‌గ్గ‌లేదు. త‌న‌దైన శైలిలో ఫోర్లు, సిక్స‌ర్ల‌తో భార‌త బౌల‌ర్ల‌ను కుదురుకోనివ్వ‌కుండా చేశాడు. శ‌త‌కానికి 9 ప‌రుగుల దూరంలో అశ్విన్ బౌలింగ్‌లో షాట్‌కు య‌త్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ర‌చిన్ ర‌వీంద్ర‌, డారిల్ మిచెల్‌లు మ‌రో వికెట్ ప‌డ‌కుండా తొలి రోజును ముగించారు.

IND vs NZ : 13, 2, 0, 0, 20, 0, 0, 0, 2, 1, 4*.. ఫోన్ నంబ‌ర్ కాదురా అయ్యా.. టీమ్ఇండియా స్కోర్ కార్డు..

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. భార‌త బ్యాట‌ర్ల‌లో ఐదుగురు డ‌కౌట్ అయ్యారు. రిష‌బ్ పంత్ (20), య‌శ‌స్వి జైస్వాల్ (13) లు మాత్ర‌మే రెండు అంకెల స్కోర్ సాధించారు.