కోహ్లీ బాటలో సింధు: కోట్ల విలువైన భారీ కాంట్రాక్ట్ కొట్టేసింది!!

భారత బ్యాడ్మింటన్ స్టార్, ప్రపంచ టాప్ ర్యాంకర్ పీవీ సింధు జాక్‌పాట్ కొట్టేసింది. చైనీస్‌ స్పోర్ట్స్‌ బ్రాండ్‌ ‘లీ నింగ్‌’ కంపెనీతో రూ. 50 కోట్ల విలువైన స్పాన్సర్‌షిప్‌ ఒప్పందంపై ఆమె సంతకం చేసింది. ఈ డీల్ ప్రకారం తెలుగు బ్యాడ్మింటన్ ప్లేయర్ చైనా కంపెనీ నాలుగేళ్లపాటు స్పాన్సర్ చేయనుంది. 

‘సింధూతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రపంచ బ్యాడ్మింటన్‌ చరిత్రలోనే చాలా పెద్దది. స్పాన్సర్‌షిప్‌, క్రీడా సామాగ్రితో కలిపి దీని విలువ రూ. 50 కోట్లు’ అని సన్‌లైట్‌ స్పోర్ట్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌, లీ నింగ్ ఇండియా పార్టనర్‌ మహేందర్‌ కపూర్‌ ఓ జాతీయ మీడియాకు శుక్రవారం తెలిపారు. రూ. 50 కోట్ల విలువైన ఈ ఒప్పందంలో రూ. 40 కోట్లు స్పాన్సర్‌షిప్‌కు, రూ.10కోట్లు క్రీడాసామాగ్రికి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 

సింధుతో చైనా కంపెనీ కుదుర్చుకున్న డీల్ బ్యాడ్మింటన్‌లోని అతిపెద్ద ఒప్పందాల్లో ఒకటని తెలుస్తోంది. ఇది లీ నింగ్-సింధు మధ్య కుదిరిన రెండో ఒప్పందం కావడం గమనార్హం. 2014-15లో ఏడాదికి రూ.1.25 కోట్ల చొప్పున రెండేళ్లపాటు సింధు ఒప్పందం చేసుకుంది. 2016లో సింధు యోనెక్స్‌తో కాంట్రాక్టు కుదుర్చుకుంది. ఏడాదికి రూ.3.5 కోట్ల చొప్పున మూడేళ్లకు ఈ ఒప్పందం కుదిరింది. 

రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత మహిళగా రికార్డ్ నెలకొల్పిన సింధు.. అత్యధిక మొత్తం ఆర్జిస్తోన్న ఫోర్బ్స్ క్రీడాకారిణుల జాబితాలో గతేడాది ఏడో స్థానంలో నిలిచింది. గతంలో విరాట్‌ కోహ్లితో ‘పూమా’ కుదుర్చుకున్న స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని ప్రస్తుత సింధూ ఒప్పందంతో పోలుస్తున్నారు.