Repairability index
Repairability index : స్మార్ట్ఫోన్లకు రిపేరింగ్ సాధ్యమేనా? అతి త్వరలో స్మార్ట్ఫోన్లకు కూడా రిపేరింగ్ ఇండెక్స్ విధానం అందుబాటులోకి రానుంది. ఈ కొత్త విధానాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేయాలని భావిస్తోంది. దీనిపై త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
స్మార్ట్ఫోన్లు మాత్రమే కాదు.. ట్యాబ్లెట్లకు కూడా రిపేరబిలిటీ ఇండెక్స్ తీసుకురానుంది. ఈ డివైజ్లను తయారు చేసి అమ్మే కంపెనీలు తప్పనిసరిగా రేటింగ్ రూపంలో రిపేరబిలిటీ ఇండెక్స్ సూచించాల్సి ఉంటుంది.
ప్రస్తుతానికి ఇంధన సామర్ధ్యంలో బల్బులు, ఏసీలు, ఫ్రిజ్, ఫ్యాన్లలో మాత్రమే రేటింగ్స్ విధానం అమల్లో ఉంది. రేటింగ్ బట్టి ఫ్యాన్ క్వాలిటీని డిసైడ్ చేస్తారు. అదేవిధంగా స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లకు మాత్రం రిపేరింగ్ ఇండెక్స్ విధానం అందుబాటులో లేదు.
దాంతో వినియోగదారులు డివైజ్ మన్నిక, క్వాలిటీ విషయంలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇందులో కూడా రిపేరింగ్ ఇండెక్స్ విధానం అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై వినియోగదారులు వీటిని కొనే ముందే ఇండెక్స్ ఆధారంగా తమ నిర్ణయాన్ని తీసుకొనేందుకు వీలుంటుంది.
ఎలక్ట్రానిక్ డివైజ్లకు సంబంధించి కీలక స్పేర్ పార్టులలో డిస్ప్లే స్క్రీన్, కెమెరా అసెంబ్లీలు, బ్యాటరీలు, చార్జింగ్ పోర్టులు, స్పీకర్లను రిపేర్ చేయొచ్చు. వీటికి రేటింగ్ కూడా ఇస్తారు. దీని సాఫ్ట్వేర్ సంబంధించి కేంద్ర వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ నివేదిక కూడా సమర్పించింది.
ఈ నివేదిక ప్రకారం.. త్వరలోనే రిపేరబిలిటీ ఇండెక్స్కు మార్గదర్శకాలు జారీ చేయనుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లలో ఈ ఇండెక్స్ రేటింగ్ అమల్లోకి తీసుకురానున్నారు. ఆ తర్వాత ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజ్లన్నింటికి విస్తరించనున్నారు.
రిపేరబిలిటీ ఇండెక్స్ సంబంధించి ప్రతి కంపెనీ సేల్ సెంటర్, ప్యాకింగ్, వెబ్సైట్ల ద్వారా వినియోగదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్డేట్ ఆధారంగా రిపేరబిలిటీ ఇండెక్స్ రేటింగ్స్ ఇస్తారు. సర్వీస్ బాగుంటే 5 పాయింట్లు, మధ్యస్థంగా ఉంటే 3 పాయింట్లు ఇస్తారు.
అమెరికా, ఈయూ, ఫ్రాన్స్ సహా అనేక దేశాలు ఇప్పటికే ఈ రిపేరబిలిటీ ఇండెక్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారత్ సైతం ఈ కొత్త రిపేరబిలిటీకి రెడీ అవుతోంది. ఇదేగానీ అమల్లోకి వస్తే.. ప్రొడక్టులు మరింత క్వాలిటీగా అందుబాటులో ఉంటాయని అంటున్నారు.