Agnipath : అప్పుడు అన్నదాతలతో..ఇప్పుడు దేశ జవాన్లతో కేంద్రం ఆడుకుంటోంది : కేటీఆర్
అగ్నివీర్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటోందని మంత్రి ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రంపై విమర్శలు సంధించారు.
Agnipath : రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్నారు. నిన్న ఉత్తరభారతంలో నిరసనలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ ఆందోళనలు తెలంగాణలోని సికింద్రాబాద్ ను తాకాయి. నిరసనకారుల ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రక్తసిక్తంగా మారింది. ఇద్దరి ప్రాణాలు తీసింది. ఎంతోమంది గాయాలపాలయ్యి ఆస్పత్రిపాలయ్యారు.
ఈ ఆందోళనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని..అగ్నివీర్ స్కీమ్ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ తీవ్రతను సూచిస్తున్నాయని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు. తొలుత దేశ రైతులతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుందని, ఇప్పుడు దేశ జవాన్లతోనూ ఆడుకుంటోందని మంత్రి ఆరోపించారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానం నుంచి ఇప్పుడు దేశంలో నో ర్యాంక్ నో పెన్షన్ గా మారిందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో కేంద్రంపై విమర్శలు సంధించారు.
ఈ ఆందోళనల ప్రభావంతో ఎంఎంటీఎస్ రైళ్లతో పాటు మెట్రోరైలును కూడా రద్దు చేశారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చెలరేగిన ఆందోళనలతో కలకలం చెలరేగడంపై రైల్వే సీపీఆర్వో రాకేశ్ స్పందించారు. రైళ్ళ పునరుద్ధరణపై ఆయన 10 టీవీతో మాట్లాడుతూ.. ఈ విషయంపై దక్షిణ మధ్య రైల్వే దృష్టిసారించిందని చెప్పారు. పూర్తిస్థాయిలో ఎంఎంటీఎస్ రైళ్ళను రద్దు చేశామని వివరించారు.
పూర్తిస్థాయిలో రైళ్ళ పునరుద్ధరణ చేసేందుకు సమయం పడుతుందని ఆయన చెప్పారు. పలు రైళ్ళను దారి మళ్ళిస్తున్నామని అన్నారు. ఆందోళనకారుల దాడిలో మూడు రైలులోని భోగీలు ధ్వంసం అయ్యాయని చెప్పారు. సమాచారం అందుకోగానే స్టేషన్లోని ప్రయాణికులను బయటికి పంపించామని తెలిపారు. పలు బోగీల్లో మంటలు అంటుకున్నాయని చెప్పారు. నేడు రిజర్వేషన్ చేసుకున్న వారికి పూర్తి రిఫండ్ ఇస్తామని తెలిపారు.