Mahabubabad : ఐదు నెలల్లో ఒకే కుటుంబంలో ముగ్గురి మరణం.. భర్త, కొడుకు మృతిని తట్టుకోలేక వృద్ధురాలు కన్నుమూత
ఈ ఏడాది జనవరిలో మాదిన రాములు, ఏప్రిల్ 25వ తేదీన కొడుకు శ్రీను ఇద్దరూ అనారోగ్యంతో మరణించారు. నెలల వ్యవధిలోనే భర్త, కొడుకు మరణించడంతో తట్టుకోలేక రాములు భార్య పార్వతమ్మ తీవ్ర మనోవేధనకు గురైంది.
- bheemraj
- Published On : May 21, 2023 / 09:21 AM IST
Old Woman Died
Old Woman Died : మహబూబాబాద్ జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. బయ్యారంలో విషాదం నెలకొంది. ఐదు నెలల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు. భర్త, కొడుకు మృతిని తట్టుకోలేక ఓ వృద్ధురాలు కన్నుమూశారు. భర్త, కొడుకు అనారోగ్యంతో మృతి చెందడంతో తీవ్ర మనోవేధనకు గురై వృద్ధురాలు అకస్మాత్తుగా మృతి చెందారు.
బయ్యారంలో బొడ్రాయి బజార్ కు చెందిన మాదిన రాములు(68), పార్వతమ్మ(62) దంపతులు. వీరికి కొడుకు శ్రీను(38) ఉన్నాడు. మాదిన రాములు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొడుకు శ్రీనును చిన్న తనం నుంచి అల్లారుముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారు.
దీంతో కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కొడుకు కొత్తగూడ మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తన కుటుంబం ఇప్పుడిప్పుడే బాగుపడుతుందనుకుంటున్నక్రమంలోనే ఈ ఏడాది జనవరిలో మాదిన రాములు, ఏప్రిల్ 25వ తేదీన కొడుకు శ్రీను ఇద్దరూ అనారోగ్యంతో మరణించారు.
నెలల వ్యవధిలోనే భర్త, కొడుకు మరణించడంతో తట్టుకోలేక రాములు భార్య పార్వతమ్మ తీవ్ర మనోవేధనకు గురైంది. దీంతో తెల్లవారుజామున పార్వతమ్మ నిద్రలోనే మృతి చెందారు. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పార్వతమ్మ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
