Pravalika Case : ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్
ప్రవళిక ఘటన తర్వాత ఫోన్ నెంబర్ మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు. Pravalika Case

Twist In Pravalika Case
Twist In Pravalika Case : తెలంగాణలో సంచలనం రేపిన ప్రవళిక ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నిందితుడు, ప్రవళిక బాయ్ ఫ్రెండ్ శివరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. పుణెలో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రవళిక ఘటన తర్వాత శివరాం పరార్ అయ్యాడు. ఫోన్ నెంబర్ మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడు.
కొత్త ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతడిని ట్రేస్ చేశారు. పుణెలో ఉన్నట్లు గుర్తించారు. శివరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు పుణె నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారు. ప్రవళిక కేసులో పరారీలో ఉన్న శివరాం కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లో వెతికారు.
ప్రవళిక ఆత్మహత్యపై రాజకీయ దుమారం..
ప్రవళిక ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం రేపింది. రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ప్రవళిక లక్ష్యంగా పెట్టుకుంది. హైదరాబాద్ అశోక్నగర్లోని హాస్టల్లో ఉంటూ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది. అక్టోబర్ 13న హాస్టల్ గదిలోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం అని ఆరోపించారు.
Also Read : స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్య కేసులో వెలుగులోకి కీలక విషయాలు
వ్యక్తిగత కారణాలే కారణం అని తేల్చిన పోలీసులు..
కాగా, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణం అని తేల్చారు. శివరాం వేధింపుల వల్లే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందన్నారు. ప్రవళిక ఘటనలో పోలీసులు ఆమె బాయ్ఫ్రెండ్ శివరాంపై కేసు నమోదు చేశారు.
ప్రవళిక ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో ఆధారాలు సేకరించారు. శివరాం అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రవళిక కుటుంబసభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.
ప్రభుత్వం నిర్వాకం వల్లే అని రాజకీయ పార్టీల ఆందోళనలు..
కాగా, ప్రవళిక ఆత్మహత్య వ్యవహారం రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాయి. ప్రభుత్వ నిర్వాకం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించాయి.
Also Read : 15 ఏళ్ల ఎదురుచూపులకు తెరదించుతూ.. జర్నలిస్ట్ సౌమ్య హత్య కేసులో కీలక తీర్పు ఇచ్చిన కోర్టు
ఇక ప్రవళిక బలవన్మరణంపై రాజకీయ పార్టీలు చేసిన ఆరోపణలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనిపై ఆందోళన చేసిన 13మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. 143, 148, 341, 332, R/W 149 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, అనిల్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, కార్పొరేటర్ విజయారెడ్డి, ఓయూ నేత సురేశ్ యాదవ్, భాను ప్రకాశ్, నీలిమ, జీవన్ లపై కేసులు నమోదయ్యాయి.