జైలు నుంచి విడుదలై.. భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత.. ఏమన్నారో తెలుసా?
కేసీఆర్ బిడ్డనని, మొండిదాన్నని, తనను ఇబ్బంది పెట్టినవారికి వడ్డీతో పాటు చెల్లిస్తానని..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ రావడంతో తిహార్ జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక ఆమెకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు స్వాగతం పలికారు.
జై తెలంగాణ నినాదంతో కవిత అక్కడి వారికి అభివాదం చేశారు. జైలు నుంచి విడుదలై.. భావోద్వేగానికి గురయ్యారు ఎమ్మెల్సీ కవిత. తాను కేసీఆర్ బిడ్డనని, మొండిదాన్నని, తనను ఇబ్బంది పెట్టినవారికి వడ్డీతో పాటు చెల్లిస్తానని చెప్పారు.కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని కవిత అన్నారు.
ఐదున్నర నెలలు జైలులో ఉండడం ఇబ్బందికర విషయమని కవిత చెప్పారు. ఇన్ని రోజుల పాటు కుటుంబానికి, తన బిడ్డలకు దూరంగా ఉన్నానని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. తన 18 ఏళ్ల రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశానని అన్నారు. తన కోసం వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు.