CM Revanth: దళితులు నడిచారని రోడ్డు శుద్ధి చేస్తారా? కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్.. సమగ్ర విచారణకు ఆదేశాలు
ర్రవల్లి ఫాంహౌస్ వద్ద అంటరానితనం ప్రదర్శించిన తీరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth) తీవ్రంగా ఖండించారు.
CM Revanth Reddy orders an inquiry into the Erravalli farmhouse demolition incident.
- స్పీకర్ ప్రసాద్పై దూషణ తీవ్రం
- ఫాంహౌస్ శుద్ధిపై సమగ్ర విచారణ
- విచారణాధికారిగా జేసీపీ విజయ్కుమార్
CM Revanth: దళిత వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్ల జరిగిన అనుచిత ప్రవర్తనను, ఎర్రవల్లి ఫాంహౌస్ వద్ద అంటరానితనం ప్రదర్శించిన తీరును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth)తీవ్రంగా ఖండించారు. శాసనసభ వేదికగా కేసీఆర్, ఆయన అనుచరుల వైఖరిపై విరుచుకుపడ్డ సీఎం, రాజకీయాల్లో విభేదాలు సహజమే అయినా ఒక దళిత స్పీకర్ను ఘోరమైన పదజాలంతో దూషించడం అక్షమ్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కుల వివక్షను, అణచివేతను ఎంతమాత్రం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు.
ఎర్రవల్లి ఘటనపై ఆగ్రహం.. దొర అహంకారాన్ని శుద్ధి చేయాలి:
దళితులు నడిచారని రోడ్డును శుద్ధి చేయడం దొరల అహంకారానికి పరాకాష్ట అని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫాంహౌస్ ప్రదేశాన్ని శుద్ధి చేశామని సోషల్ మీడియాలో పోస్టులు రావడంపై మండిపడ్డారు. శుద్ధి చేయాల్సింది నేలను కాదని, తరతరాలుగా కొందరి మనసుల్లో ఉన్న కుళ్లు, కుల అంతరాలను అని హితవు పలికారు. స్పీకర్ను తిట్టిన వారిని, దళిత సమాజాన్ని అవమానించిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని అసెంబ్లీలో తేల్చి చెప్పారు.
విచారణాధికారిగా విజయ్ కుమార్.. కుట్రదారులపై క్రిమినల్ కేసులు:
సెప్టెంబర్ 6న ఫాంహౌస్ సమావేశం నుంచి మొదలై వరుసగా జరిగిన ఘటనలన్నింటిపై సమగ్ర విచారణకు ఉత్తర్వులు జారీ చేసినట్లు సీఎం ప్రకటించారు. విచారణాధికారిగా హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్కుమార్ను నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంటరానితనం ఘటనల వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందుకు తెచ్చి కోర్టులో దోషులుగా నిలబెడతామని, అసెంబ్లీ వద్ద మహిళలపై జరిగిన ఇబ్బందులు, విధుల్లో ఉన్న వారిపై దాడులపైనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
