Amrapali: ఆమ్రపాలి విషయంలో కేంద్రానికి లేఖ రాయనున్న తెలంగాణ ప్రభుత్వం!
విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.

Amrapali
ఆ ఐదుగురికి అనుకోని కష్టం వచ్చి పడింది. భాగ్యనగరంలో అంటూ హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటున్న ఆ IAS ఆఫీసర్లకు ఉన్నట్లుండి కేంద్రం నుంచి హుకుం వచ్చింది. మీరు ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఆర్డర్స్ వచ్చేశాయ్. ఇప్పడేం చేయాలి బాబోయ్ అంటూ..గాబరా పడిపోతున్నారట. ఆ ఆఫీసర్లే కాదు తెలంగాణ ప్రభుత్వం కూడా IASల విషయంలో ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
డైనమిక్గా పనిచేసే ఆమ్రపాలి లాంటి ఒకరిద్దరు అధికారులను రాష్ట్రంలోనే ఉంచేలా కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ సర్కార్ లేఖ రాయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణలో పనిచేస్తున్న IAS అధికారుల్లో ఎవరెవరు ఏపీకి వెళ్తారు..ఎవరు ఇక్కడే ఉండిపోతారన్న ఆసక్తి కొనసాగుతోంది.
తెలంగాణలో పనిచేస్తున్న IASలు ఆమ్రపాలి, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ప్రశాంతి ఏపీకి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష, అభిషేక్ మొహంతి కూడా ఏపీలో రిపోర్టు చేయాలని DOPT ఉత్తర్వుల్లో ఉంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారుల కొరత ఉండటంతో పలువురు అధికారులకు రెండేసి శాఖలను అప్పగించించింది తెలంగాణ ప్రభుత్వం.
తెలంగాణ ప్రభుత్వం విముఖత!
ఇటువంటి సమయంలో 5 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ఏపీకి వెళ్లిపోవాలని కేంద్రం చెప్పడంతో తెలంగాణ సర్కార్ సందిగ్దంలో పడిందని అంటున్నారు. అందులోనూ విద్యుత్ శాఖ సెక్రటరీగా ఉన్న రొనాల్డ్ రాస్, GHMC కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి వంటి అధికారులను ఏపీకి పంపించడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తోంది.
GHMC కమిషనర్గా పనిచేస్తున్న ఆమ్రపాలి..తాను తెలంగాణలోనే కొనసాగేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని రేవంత్ సర్కార్కు విజ్ఞప్తి చేశారని తెలుస్తోంది. రాష్ట్రప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. అయితే UPPSC అప్లికేషన్లో ఆమ్రపాలి తన పర్మినెంట్ అడ్రస్ను విశాఖపట్నంగా మెన్షన్ చేశారు. దాంతో ఆమెను ఏపీ కేడర్కు కేటాయించారు. తనను తెలంగాణ స్థానికురాలిగా గుర్తించి తెలంగాణ కేడర్కు పంపాలని ఆమ్రపాలి కోరినప్పటికీ ఆ అభ్యర్థనను కేంద్రం తిరస్కరించింది.
2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి IASగా శిక్షణ పూర్తి చేసుకున్నాక మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్గా, తర్వాత కొంతకాలం హైదరాబాద్లోని స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో పనిచేశారు. 2015లో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్గా, కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అక్కడి నుంచి GHMC జాయింట్ కమిషనర్గా బదిలీ అయ్యారు.
అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని టాక్
తెలంగాణ ఎలక్షన్ కమిషన్లో జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా పని చేశారు. 2020లో కేంద్ర సర్వీసుల్లో జాయిన్ అయి డిప్యూటీ కార్యదర్శిగా పనిచేశారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో తెలంగాణ రాష్ట్ర సర్వీసులో చేరారు. HMDA కమిషనర్గా ఆమ్రపాలి పనిచేశారు. ప్రస్తుతం GHMC కమిషనర్గా ఆమ్రపాలి కొనసాగుతున్నారు. ఏ శాఖలో ఉన్నా ఆమె డైనమిక్గా పనిచేస్తారన్న పేరుంది. ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేసి..అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని టాక్ ఉంది. అందుకే ఆమ్రపాలిని ఇక్కడే కొనసాగించే ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది.
ఆమ్రపాలితో పాటు విద్యుత్ శాఖ కార్యదర్శిగా ఉన్న రొనాల్డ్ రాస్ను కూడా తెలంగాణలోనే కొనసాగించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్ర హోంశాఖకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నెల 16లోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని DOPT ఆదేశించిన నేపథ్యంలో అంతలోపు కేంద్రంతో సంప్రదింపులు జరిపి వీళ్లను ఏపీకి పంపకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సీఎస్కు సూచించినట్లు సచివాలయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మిగతా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా తెలంగాణను విడిచి వెళ్లేందుకు అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది.