తిహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత.. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు.

Kavitha

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఇవాళ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. నేటితో కవిత ఈడీ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో జడ్జి కావేరి భవేజా ముందు కవితను హాజరుపర్చారు. మరో 14 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిశాక కోర్టు తీర్పును రిజర్వ్ చేసి, కాసేపటికే తీర్పు ఇచ్చింది. 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించింది. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉండనున్నారు కవిత.

వచ్చే నెల 16 వరకు కవిత చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని, అప్పటివరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత న్యాయవాది విక్రమ్ చౌదరి కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 విచారణ జరపనుంది. కవిత కేసు దర్యాప్తుకు సహకరించడం లేదని.. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని.. మరికొందరు నిందితులను ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు ఈడీ తెలిపింది. కాగా, లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న అరెస్ట్ అయ్యారు కవిత.

ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు వద్దే కవిత భర్త అనిల్, బంధువులు ఉన్నారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19(2) ప్రకారం నమోదు చేసిన స్టేట్మెంట్ ని తమకు కూడా ఇవ్వాలని కోరారు కవిత తరఫు న్యాయవాది. ఒక అప్లికేషన్ దాఖలు చేయాలని సూచించారు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి. కవిత దాఖలు చేసిన బెయిల్ అప్లికేషన్ పై రిప్లై దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని ఈడీ న్యాయవాది కోరారు.

కేసు దర్యాప్తు పురోగతి లో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది ఈడీ. వర్చువల్ మోడ్ లో ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. లిక్కర్ కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఈడీ తెలిపింది.

తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు.. కానీ..
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు. ఇది మనీ లాండరింగ్ కాదని పొలిటికల్ లాండరింగ్ కేసని వ్యాఖ్యానించారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చని, కానీ తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. మొదటి నిందితుడు బీజేపీలో చేరారని అన్నారు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మూడో నిందితుడు బీజేపీకి ఎలక్ట్రోరల్ బాండ్స్ ఇచ్చారని చెప్పారు. తాను అప్రూవర్ గా మారడం లేదని అన్నారు.

అతి పెద్ద డ్రగ్స్ లింకును ఛేదించిన పోలీసులు.. కాంటాక్ట్ లిస్టులో హైదరాబాద్‌కి చెందిన 31 మంది వినియోగదారులు

ట్రెండింగ్ వార్తలు