తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భవనాల కూల్చివేతకు పర్యావరణ శాఖ అనుమతి అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది. రాష్ట్ర మంత్రి వర్గ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ భవనాల కూల్చివేత పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది.
భవనాల కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ), స్టేట్ లెవల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఈఐఏఏ) హైకోర్టుకు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం నోటీఫై చేసిన ‘నిర్మాణం- కూల్చివేత నిబంధనలు- 2016’ను పాటిస్తే సరిపోతుందని పేర్కొన్నాయి. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పాత సచివాలయ భవనాలు కూల్చుతున్నారని దాఖలైన పిటిషన్పై చీఫ్ జస్టిస్ రాఘవేంద్రసింగ్చౌహాన్, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
బుధవారం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. పీసీబీ, ఎస్ఈఐఏఏ వివరణను ధర్మాసనానికి సమర్పించారు. శుక్రవారం నాటికి విచారణ వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించిన విషయం విదితమే. శుక్రవారం (జులై 17, 202) విచారణ చేపట్టిన కోర్టు.. భవనాల కూల్చివేతను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్ ను కొట్టేసింది.