Hyderabad : తల్లి తండ్రులపై మానవహక్కుల కమీషన్లో ఫిర్యాదు చేసిన కన్నకొడుకు
కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని... వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.
Hyderabad : కన్న తల్లి తండ్రుల నుంచి ప్రాణహాని ఉందని… వారి వేధింపుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ఓ యువకుడు మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించాడు.
మహాబూబాబాద్ జిల్లా ఎల్లంపేట గ్రామానికి చెందిన మాలె శ్రీనివాస్ అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతని తల్లితండ్రులు సత్యనారాయణ, సత్యవతిలు గ్రామంలోనే ఉంటున్నారు. కాగా… తన తల్లితండ్రులు గ్రామంలోని ఆస్తులను అమ్మేసి తనను డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారని శ్రీనివాస్ మానవ హక్కుల కమీషన్కు ఫిర్యాదు చేశాడు.
తాను బ్యాంకులో లోను తీసుకుని ఎంసీఏ చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నానని అతను వివరించాడు. పార్ట్ టైం జాబ్ లు చేసుకుంటూ కష్టపడి లోన్లు కట్టుకున్నానని తెలిపాడు. ఊరిలో ఉన్న ఆస్తులు అమ్మేసిన తల్లితండ్రులు అప్పులు అయ్యాయని చెప్పి తన వద్ద గత ఏడాది 22 లక్షల రూపాయలు తీసుకున్నారని చెప్పాడు. అప్పుడు 22 లక్షల రూపాయలు సమకూర్చి పెద్దల సమక్షంలో ఇచ్చానని… ఇప్పుడు మరో 15 లక్షల రూపాయలు ఇవ్వాలని తల్లితండ్రులు వేధిస్తున్నారని వాపోయాడు.
వారి వేధింపులతో తనకు బ్రెయిన్ టీబీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మానసికంగా వేధిస్తున్న తల్లి తండ్రులపైనా..స్థానిక ఎల్లంపేట సర్పంచ్, మరిపెడ పోలీసుల పైనా చర్యలు తీసుకొని, తనకు రక్షణ కల్పించాలని శ్రీనివాస్ కమిషన్ను వేడుకున్నాడు.