మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఖర్గేనూ వదిలిపెట్టబోమని వార్నింగ్

మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు.

మాజీ ఎంపీ హర్షకుమార్‌పై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఖర్గేనూ వదిలిపెట్టబోమని వార్నింగ్

Manda krishna madiga: అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌పై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబడుతున్న హర్షకుమార్‌ తన రాజకీయ అవసరాల కోసమే కులాన్ని వాడుకున్నారని, జాతి కోసం చేసిందేమి లేదని విమర్శించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు మోకాళ్లు అడ్డిందే హర్షకుమార్.. అలాంటి వ్యక్తి టీడీపీలో ఎందుకు చేరారు? హర్షకుమార్ సమాధానం చెప్పాలి. వర్గీకరణ పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న వారిమీద నేను మాట్లాడను. పార్లమెంటులో బిల్లు అనుకూలంగా ఉన్నప్పుడు రాష్ట్రాల మీద నెపం వేసిండు. ఇవాళ రాష్ట్రాలకు ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు చెప్పగానే మళ్ళీ పార్లమెంట్ ప్రస్తావన తీసుకొస్తున్నారని మందకృష్ణ అన్నారు.

మాలల్లో రాజకీయంగా ఎదిగిన అనేక మంది మనువాదులు అంబేద్కర్ ఐడియాలజీని ఎప్పుడో పక్కన పెట్టారని.. విప్లవోద్యమం పేరుతో దళితులను వాడుకున్నారని మందకృష్ణ విమర్శించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణకు అనుకూలంగా 90% మంది మాలలు ఎమ్మార్పీఎస్‌కు మద్ధతు ఇచ్చారని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తిగానే ఉంటానని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు చెబుతానన్నారు.

ఖర్గేను వదిలిపెట్టం.. నిలదీస్తాం
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను వదిలిపెట్టబోమని, గట్టిగా నిలదీస్తామని మందకృష్ణ అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వర్గీకరణకు అనుకూలంగా ఉంటే ఖర్గేకు బాధ ఎందుకని ప్రశ్నించారు. ఎంతో కొంతో రేవంత్ రెడ్డిని నమ్ముతాను, ఖర్గేను నమ్మను అని వ్యాఖ్యానించారు. వర్గీకరణకు మల్లిఖార్జున ఖర్గే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్వాగతించారని, ఖర్గే ఎందుకు స్వాగతించలేదని ప్రశ్నించారు.ఖర్గే తమ కులానికే నాయకుడని, దళితుందరికీ కాదన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.