Rain Alert : జాగ్రత్త.. మళ్లీ వర్షాలే వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్.. ఉరుములతో భారీ వర్షాలు కురిసే చాన్స్..
Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, మరో మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ..

Heavy Rains
Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. అయితే, మరో మూడు రోజులు ఆయా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో నైరుతీ రుతుపవనాలు పూర్తిగా నిష్ర్కమించిన తరువాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడానికి అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో ఈశాన్య రుతుపవనాలు దాదాపు ప్రవేశించే సమయంలోనే అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సందర్భంగా అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఈ ఆవర్తనం దాదాపుగా అల్పపీడనంగా మారితే తెలంగాణలో మూడు రోజులుపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Cm Revanth Reddy: ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు.. అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్..
ఇవాళ (ఆదివారం) హనుమకొండ, సిద్ధిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వాస్తవానికి ఈశాన్య రుతుపవనాల కాలం అక్టోబరు నుంచి డిసెంబర్ కొనసాగుతుంది. ఈ సమయంలో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉన్నందున రైతులు, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వర్షాలు పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం పడే సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. ఈదురుగాలులతోపాటు పిడుగులు పడే చాన్స్ ఉన్న కారణంగా వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని, హోర్డింగ్లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో వేచి ఉండొద్దని సూచించింది.