Harish Rao : బ్రిటన్ నుంచి వచ్చి.. చిన్నారులకు ప్రాణం పోసిన డాక్టర్లకు మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీంతో నిమ్స్ లో గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ ని హరీశ్ రావు అభినందించారు. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
Harish Rao : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో 9మంది చిన్నారులకు గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ కి వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి హరీశ్ ఆహ్వానం మేరకు వచ్చిన యూకే వైద్య బృందం.. హార్ట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహించింది. దీంతో నిమ్స్ లో గుండె సర్జరీలు చేసిన డాక్టర్ రమణ టీమ్ ని హరీశ్ రావు అభినందించారు. చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
తెలంగాణలోని అన్ని ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు. డాక్టర్ రమణ టీమ్ ని అందరం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు మంత్రి హరీశ్ రావు. యూకే నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం.. 4 రోజుల్లో 9మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేసింది.
నిమ్స్ ఆస్పత్రిలో యూకే వైద్యులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి హరీశ్రావు పాల్గొన్నారు. పసి పిల్లలకు అరుదైన హార్ట్ సర్జరీలు నిర్వహించి, వారి ప్రాణాలను కాపాడిన బ్రిటన్ వైద్య బృందానికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
”పసి హృదయాలను కాపాడేందుకు, తమ ఆహ్వానం మేరకు నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన బ్రిటన్ వైద్య బృందానికి ధన్యవాదాలు. డాక్టర్ వెంకట రమణ దన్నపనేని తమ బృందంతో వచ్చి నిలోఫర్, నిమ్స్ డాక్టర్లకు సహకారం అందించారు. అందరూ కలిసి 9 మంచి చిన్నారులకు సర్జరీలు నిర్వహించారు.
ఎక్మో మీద ఉన్న చిన్నారికి కూడా సర్జరీ చేయడం గొప్ప విషయం. ఒక్కో సర్జరీని 20 మందితో కూడిన వైద్య బృందం 4-5 గంటల పాటు చేశారు. 9 మంది ప్రాణాలు కాపాడారు” అని మంత్రి హరీశ్రావు తెలిపారు.
”పుట్టిన రాష్ట్రంలోని ప్రజలకు సేవ చేయాలని వచ్చిన డాక్టర్ రమణకు ప్రత్యేక అభినందనలు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డాక్టర్లు పుట్టిన గడ్డకు మేలు చేయాలి” అని మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.
విదేశీ నిపుణులను తీసుకొచ్చి ఇలాంటి క్లిష్టమైన సర్జరీలు చేసిన సందర్భం ఢిల్లీ ఎయిమ్స్ తర్వాత ప్రభుత్వ నిమ్స్ లోనే జరిగిందని మంత్రి హరీశ్ గుర్తు చేశారు. చిన్న పిల్లలకు గుండె సర్జరీ చేయడం అనేది అత్యంత క్లిష్టమైన, ఖరీదైన వైద్యమని.. దీని కోసం ప్రైవేటులో లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అయితే.. నిమ్స్లో ఈ 9 మంది చిన్నారులకు పూర్తి ఉచితంగా సర్జరీలు చేసినట్టు తెలిపారు. ఈరోజు నాకెంతో సంతోషంగా అనిపించింది, సర్జరీ తర్వాత ఆ పిల్లలు నవ్వుతుంటే మనసు నిండిపోయింది అంటూ మంత్రి హరీశ్ రావు భావోద్వేగానికి లోనయ్యారు.