కరోనా చికిత్సకు రూ.28 వేలు ఫీజు.. కొత్త కోవిడ్కేర్ సెంటర్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా భయం అందరిని భయభ్రాంతకులకు గురిచేస్తోంది. కరోనా వచ్చిందని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్యం ఖరీదైపోయింది. సామాన్యులు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి కరోనా వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు.
ఒకవైపు కరోనా వచ్చిందని ఆందోళన చెందుతున్న బాధితులకు ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులు వేసే లక్షల బిల్లుల చూసి దడ పుట్టిస్తోంది. ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నాక బాధితులు చనిపోయిన సరే.. బిల్లలు చెల్లించాల్సిందేనని కుటుంబ సభ్యులను వేధిస్తున్నారు.. సర్కార్ ఆస్పత్రుల్లో కరోనా వైద్యంపై ప్రజలకు నమ్మకం కుదరడం లేదు.. కనీస సౌకర్యాలు లేవని ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేందుకు ప్రజలంతా కంగారు పడుతున్నారు.
దయానీయ పరిస్థితుల్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. కరోనా వైద్యాన్ని అతి అతి తక్కువ ఫీజులతో అందిస్తోంది. నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందిస్తోంది.. వంద పడకల ‘ కోవిడ్కేర్ సెంటర్’పేరుతో ముందుకు వచ్చింది.. అదే జైన్ ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ. దాతల సహాయ సహకారాలతో పని చేస్తున్న ఈ సంస్థ విద్య, వైద్య రంగాల్లో తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తోంది. కరోనా బాధితులను ఆదుకొనేందుకు ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఇప్పటికే 15 కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది. 16వ కోవిడ్ కేర్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. బేగంపేట్లోని మానస సరోవర్లో 100 పడకలతో ఏర్పాటు చేసింది. అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా, వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ ఆస్పత్రిలో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. తక్కువ ఫీజుతోనే అన్ని రకాల సదుపాయాలు కల్పించనున్నట్లు జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రతినిధి వినోద్ రాంకా తెలిపారు.
బేగంపేట్ చిరాగ్ఫోర్ట్లో ఉన్న మూడంతస్తుల మానససరోవర్ హాటల్ను జైన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. మొదటి, రెండో అంతస్తులలో 100 పడకలను ఏర్పాటు చేశారు. కోవిడ్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే ఈ ఆస్పత్రిలో చేరవచ్చు. ఒక గదిలో ఇద్దరు చొప్పున ఉంటే వారం రోజులకు ఒక్కొక్కరు రూ.28000 చొప్పున చెల్లిస్తే చాలని అంటోంది. ఒక్కరే ప్రత్యేకంగా ఒక సింగిల్ రూమ్లో ఉండాలనుకొంటే వారం రోజులకు రూ.35000 ఫీజు ఉంటుంది.
ఈ ఫీజులోనే కోవిడ్ నివారణకు అవసరమయ్యే మందులు, చికిత్స, ఆక్సిజన్ సహా తదితర అన్ని సదుపాయాలు లభిస్తాయి. పేషెంట్లు త్వరగా కోలుకొనేందుకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందజేస్తారు. అయితే కేవలం శాఖాహారం మాత్రమే ఇస్తారు. రోగులలో షుగర్, హైబీపీ, కిడ్నీ సమస్యలు వంటి జబ్బులతో బాధపడేవాళ్లు ఉంటే వారి కోసం ఆహారంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఆస్పత్రిలో చేరే సమయంలోనే ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే బాధితులు ముందుగానే రికార్డు చేయించుకోవాల్సి ఉంటుంది.
ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఆరుగురు వైద్య నిపుణులు 24 గంటల పాటు విధులు నిర్వహిస్తారు. నర్సులు, పారామెడికల్ సిబ్బంది రోగులను జాగ్రత్తగా చూసుకుంటారు. అంబులెన్స్ సదుపాయం కల్పిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో రోగులను పెద్ద ఆస్పత్రులకు తరలించే సర్వీసులను అందిస్తోంది. కోవిడ్ కేర్ సెంటర్లో ఆక్సిజన్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. వెంటిలెటర్లు ఉండవని స్పష్టం చేశారు. రోగికి వెంటలెటర్ అవసరమైతే మాసాబ్ట్యాంకులోని మహావీర్ ఆసుపత్రిలో తక్కువ చార్జీల్లోనే వెంటిలెటర్ సదుపాయంతో పొందవచ్చునని తెలిపింది. ఇక హెల్ప్ లైన్ నెంబర్ల విషయాననికి వస్తే.. 91211 55500, 91212 55500 , 91213 55500 మరిన్ని అందుబాటలో
ఉన్నాయి.