జాగ్రత్త సుమా, తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్, మూడు రోజులు భారీ వర్షాలు

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 06:40 AM IST
జాగ్రత్త సుమా, తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్, మూడు రోజులు భారీ వర్షాలు

Updated On : October 10, 2020 / 10:19 AM IST

Rain alert in Telugu states : తెలుగు రాష్ట్రాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. వచ్చే మూడు రోజుల రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌ ఉందని తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.



ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.



అల్పపీడనం 24 గంటలలో మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో అక్టోబర్‌ 12న వాయుగుండంగా తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాయలసీమ, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.



అలాగే రాయలసీమ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు.



మరోవైపు 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం సాయంత్రపు వేళ చిన్నగా మొదలైన వర్షం… ఆ తర్వాత కొద్ది కొద్దిగా స్పీడ్ అందుకుంది. మూడు గంటలకు పైగా ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షం ఒక్కసారిగా భాగ్యనగరాన్ని వణికించింది.



ఏకధాటిగా కురిసిన వర్షంతో ఉద్యోగస్తులు, ప్రజలు నరకం చూశారు. గంటకు 2 సెంటిమీటర్లే తట్టుకునే హైదరాబాద్ డ్రైనేజీ వ్యవస్థ.. ఏకంగా 15 సెంటిమీటర్ల వర్షం కురిసేటప్పటికి అతలాకుతలం అయింది.