ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోల రెస్క్యూ ఆపరేషన్.. ఈ రోబోలు ఏయే పనులు, ఎలా చేస్తాయి?
రోబోల్లో ఒకటి రాళ్లతో పాటు ఇతర శిథిలాలను తీసేస్తుంది.

Robots
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో చిక్కుకుపోయిన వారిని గుర్తించేందుకు కృత్రిమ మేధతో పనిచేసే రోబోలను నేటి నుంచి రంగంలోకి దింపారు. హైదరాబాద్లోని ఎన్వీ రోబో టిక్స్ టీమ్ నిన్న ఎస్ఎల్బీసీ ప్రాంతానికి చేరుకుంది.
అక్కడ 3 రకాల రోబోలను వాడనున్నారు. ఆ రోబోలను ఆపరేట్ చేయడానికి మాస్టర్ రోబోను అక్కడకు తీసుకెళ్లారు. నిపుణులు విజయ్, అక్షయ్ ఆధ్వర్యంలో రోబోలను ఆపరేట్ చేస్తున్నారు. ఎస్ఎల్బీసీలో గల్లంతైన వారిలో ఒకరి మృతదేహాన్ని బటయకు తీసిన విషయం తెలిసిందే.
మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేరళ కడావర్ శునకాలు గుర్తించిన స్పాట్ల మధ్యలో ప్రస్తుతం ట్రెంచ్ను తొవ్వుతున్నారు. ఆ ప్రాంతాల్లో మళ్లీ ఆ శునకాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో లోపల 13.850 కిలోమీటర్ల వద్ద ప్రమాదం జరిగింది.
Also Read: ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు రూ.3 లక్షలు.. 15 నుంచి అప్లికేషన్స్.. ఇలా అప్లై చేసుకోండి..
అయితే, చివరి 20 మీటర్ల వద్ద పైకప్పు కూలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రోబోలను వాడుతున్నారు. రోబోల్లో ఒకటి రాళ్లతో పాటు ఇతర శిథిలాలను తీసేస్తుంది. మరో రోబో మట్టిని తీస్తుంది. బురదను మూడో రోబో తొలగిస్తుంది. వీటి ద్వారా 3 రోజుల్లో ఆ పనులు పూర్తవుతాయి.
టన్నెల్ వద్ద 12 ఏజెన్సీలకు చెందిన సిబ్బంది ప్రతిరోజు మూడు షిప్టుల్లోనూ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితాలు రావడం లేదు. డాక్టర్లు సైతం టన్నెల్ వద్ద అందుబాటులో ఉన్నారు.
టన్నెల్లో 200 మీటర్ల వరకు బురద, వ్యర్థాలు కొట్టుకొచ్చాయి. వాటిని ఎస్కవేటర్ల ద్వారా తొలగిస్తుంటే పైన ఉన్న మట్టి కిందికి జారుతుండడంతో సహాయక చర్యలు ఫలితాన్ని ఇవ్వడం లేదని తెలుస్తోంది.