Vizag Steel Plant: అక్కడ ఉద్యోగులను ఆదుకుంటారట.. మరి ఇక్కడ మూతపడ్డ కంపెనీల పరిస్థితి?: షర్మిల

"రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతారట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా?" అని షర్మిల ప్రశ్నించారు.

Vizag Steel Plant

Vizag Steel Plant: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ఆమె స్పందిస్తూ.. ముందుగా రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకోవాలంటూ ట్వీట్ చేశారు.

“తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు.. కానీ, దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డారు. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతరట. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతారట. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటారట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా?” అని షర్మిల ప్రశ్నించారు.

“తెలంగాణలో గెలిస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని మోసం చేశావ్. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశావ్. ఎన్నడో మూతపడిన IDPL, HMT, HCL,ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదు.

ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించు. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకో. దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించు. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకో” అని షర్మిల ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Vizag Steel Plant: అలాగైతే బిడ్డింగ్‌లో ఎలా పాల్గొంటారు?: బీఆర్ఎస్ కి ఏపీ మంత్రి అమర్‌నాథ్, సలహాదారు సజ్జల సూటి ప్రశ్న