ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు తనకు జారీ చేసిన నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

ఢిల్లీ పోలీసుల నోటీసులపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy (photo: @revanth_anumula)

CM Revath Reddy: ఢిల్లీ పోలీసుల నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారని, సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన తనకు, గాంధీ భవన్ నేతలకు ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తోందన్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్ మన్నే సతీష్, స్టేట్ సెక్రటరీ శివకుమార్, స్పోక్స్ పర్సన్ అస్మా తస్లిమ్, నవీన్‌కు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు. కాగా, సోమవారం కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మోదీని ఓడించాలి.. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను నమ్మించి మోసం చేశారని, అలాంటి మోదీని ఓడించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కర్ణాటకలోని గుర్మిట్కల్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారని.. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిచాలని.. లక్ష మెజారిటీతో గుర్మిట్కల్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.

గుర్మిట్కల్‌ నుంచి తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఖర్గే కొనసాగారు. 1972లో మొదటిసారిగా మీరు ఎన్నుకున్న మల్లికార్జున ఖర్గే.. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గుర్మిట్కల్ ప్రజల ఆశీర్వాదం వల్లే ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు. మీరు ఇచ్చిన స్ఫూర్తితో కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఐదు గ్యారంటీలను కర్ణాటక ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేసుకున్నాం.

పదేళ్లలో మోదీ ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని మోదీ మోసం చేశారు. 40 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోదీ.. ఒక్క పైసా కూడా పేదల ఖాతాల్లో వేయలేదు. కర్ణాటక నుంచి 26 ఎంపీలను ఇస్తే.. మోదీ కర్ణాటకకు ఇచ్చింది ఒకటే కేబినెట్ పదవి. కర్ణాటకకు మోదీ ఇచ్చింది ఏమీ లేదు.. ఖాళీ చెంబు తప్ప. కరువు వస్తే కనీసం బెంగుళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు. సమర్ధుడు, మీ కోసం కొట్లాడే వారికే ఓటువేసి గెలిపించండి. ఇక్కడ కాంగ్రెస్ కు ఒక్క ఓటు వేస్తే.. ఇక్కడున్న ముగ్గురు నాయకులు మీకు సేవ చేస్తారని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read: అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసు.. సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు